గర్భధారణ సమయంలో మహిళలకు ఎంతో సంరక్షణ, పౌష్టికాహారం అవసరం. ఇలాంటి సమయంలో వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. అదే “ప్రధాన మంత్రి మాతృ వందన యోజన” (PMMVY). ఈ పథకం ద్వారా అర్హులైన గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం రూ.6,000 వరకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
మొదటి కాన్పుకు రూ.5,000 సాయం: ఈ పథకం కింద మొదటిసారి తల్లి కాబోయే మహిళలకు ప్రభుత్వం రూ.5,000 అందిస్తుంది. అయితే ఈ డబ్బును ఒకేసారి కాకుండా రెండు విడతల్లో చేతికి అందిస్తారు. గర్భం దాల్చినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని, కనీసం ఒక యాంటెనాటల్ చెకప్ పూర్తి చేసుకున్న తర్వాత మొదటి విడతగా రూ.3,000 ఇస్తారు. ఇక ఆ తర్వాత బిడ్డ పుట్టినట్లు నమోదు చేయించి తొలి విడత టీకాలు వేయించాక రెండో విడతగా మరో రూ.2,000 అందిస్తారు.

రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6,000: ఈ పథకంలో మరో పెద్ద ప్రయోజనం కూడా ఉంది. ఒకవేళ రెండో కాన్పులో గనుక ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లికి ప్రభుత్వం ఏకంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. మొదటి కాన్పులా కాకుండా ఈ రూ.6,000 నగదును విడతల వారీగా కాకుండా ఒకేసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఇక ఇది ఆడపిల్లల పుట్టుకను ప్రోత్సహించడానికి మరియు వారి సంరక్షణకు ఎంతగానో దోహదపడుతుంది.
ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు: ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడం చాలా సులభం. అర్హులైన గర్భిణీ మహిళలు ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్ pmmvy.wcd.gov.in లోకి వెళ్లి వివరాలను నమోదు చేసి, సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
గర్భిణీలకు మరియు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి ఈ “ప్రధాన మంత్రి మాతృ వందన యోజన” ఒక గొప్ప వరమనే చెప్పాలి. లభించే ఆర్థిక సాయం పౌష్టికాహార ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ప్రభుత్వ సాయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.
The post ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణీల ప్రయోజనం appeared first on Manalokam – Latest Telugu News & Updates.