
పల్నాడు జిల్లాలో సోమవారం (జూన్ 22) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పలువురు ఆటోలో యడ్లపాడు మండలం సంకరాత్రిపాడు గ్రామానికి బయలుదేరారు. అక్కడ జరుగుతున్న దశదిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కామేపల్లి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఘటనాస్థలంలోనే వేల్పూరుకు చెందిన సుబ్బాయమ్మ, ఏడుకొండలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రమనమ్మను చికిత్స కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే నరసరావుపేటలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటన వేల్పూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
రోడ్డు ప్రమాద దృశ్యలు ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..