
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పొలిటికల్ గా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఏప్రిల్ 20న జిల్లాలో ఒకే రోజు పర్యటించనుండటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను పరిశీలించి కాటారం బహిరంగ సభలో పాల్గొనుండగా…. జగిత్యాలలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇదే సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఏప్రిల్ 20న మధ్యాహ్నం జిల్లాకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. తొలుత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ పునర్నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
అనంతరం సీఎం రేవంత్ మేడిగడ్డకు చేరుకుంటారు. గత కొంతకాలంగా చర్చనీయాంశమైన మేడిగడ్డ డ్యామ్ సైట్ను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. డ్యామ్ భద్రత, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో స్థితిగతులను అంచనా వేస్తారు. మేడిగడ్డ పరిశీలన ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కాటారం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ సభ వేదికగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా రెండో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.