Reading Time: < 1 minute
Womens Reservation Law Comes Into Effect From Midnight Sparks Debate In Parliament

నిన్నటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. 18 గంటల చర్చ తర్వాత శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. కానీ ఇంతలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. బిల్లులపై పార్లమెంట్‌లో తీవ్ర వాగ్యుద్ధం నడుస్తున్న తరుణంలోనే కేంద్ర న్యాయ శాఖ సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్ధరాత్రి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది.

మహిళా రిజర్వేషన్ చట్టం-2023 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిందని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగం (106వ సవరణ) చట్టం-2023లోని నిబంధనలు ఏప్రిల్ 16, 2026 నుంచి అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే న్యాయ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఓటింగ్ నిర్వహించకుండానే నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై అర్ధరాత్రి వరకు తీవ్రంగా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం- 2023 గురువారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే ఒక అధికారి మాత్రం ‘‘సాంకేతిక కారణాలు’’ కావొచ్చని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం లోక్‌సభలోని మహిళలకు తక్షణ ప్రయోజనం ఏమీ ఉండదని.. తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయబడతాయని అధికారి చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.