Reading Time: 2 minutes
Unknown Gunmen Target Terror Operatives In Pakistan Series Of Attacks Raise Questions

Unknown Gunmen: పాకిస్తాన్‌లో ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’ సంచలనం సృష్టిస్తున్నారు. లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాద్, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన టెర్రరిస్టుల్ని హతమారుస్తున్నారు. తాజాగా లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన అమీర్ హమ్జా లాహోర్‌లో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కాల్పులకు గురయ్యాడు. గురువారం మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు హమ్జాను దగ్గర నుంచి కాల్చారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

గత రెండు మూడేళ్లుగా ఒకే తరహాలో అజ్ఞాత ధురంధరులు పాక్ ఉగ్రవాదుల్ని, భారత వ్యతిరేకుల్ని హతమారుస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ హత్యల్లో విదేశీ హస్తం ఉందని చెబుతూ, భారత్‌ వైపు వేలు చూపించే ప్రయత్నం చేసింది.

* గత నెలలో హమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్తాన్ లో సందేహాస్పదంగా మరణించాడు. ఇతను జైషే మహ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజార్ అన్నయ్య. జైష్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు.

* గతేడాది మార్చిలో పాకిస్తాన్ జీలం సింధ్ లో లష్కరే ఉగ్రవాది అబూ ఖతర్ అలియాస్ ఖతల్ సింధీని హతమయ్యాడు. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఇతరు ప్రధాన అనుచురుల్లో ఒకడు. 2024 జమ్మూ కాశ్మీర్ రియాసి దాడికి ఇతనే సూత్రధారి. భారత్‌లో జరిగిన అనేక దాడులకు అబూ ఖతర్ ప్రధాన కారణం.

* ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్‌వార్‌ను కూడా 2023లో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. లాహోర్‌లో జోహార్ టౌన్‌లో వాకింగ్ వెళ్తున్న ఇతడిని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఇతను భారత్ పంజాబ్‌లో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు.

* హఫీజ్ సయీద్ మరో సన్నిహితుడు ముఫ్తీ ఖైసర్ ఫరూఖ్‌ను కరాచీలో ధురంధరులు చంపేశారు. 2023లో సమనాబాద్ ప్రాంతంలో ఒక మసీదు వద్ద హత్యకు గురయ్యాడు.

*భారత మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది షాహీద్ లతీఫ్ కూడా ఇలాగే చచ్చాడు. 2016 పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారిగా ఆరోపించబడిన షాహిద్ లతీఫ్‌ను, 2023 అక్టోబర్‌లో పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.

*లష్కర్ హై లెవల్ కమాండర్ ఖ్వాజా షాహిద్ 2023లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్ఓసీకి సమీపంలో హత్యకు గురయ్యాడు. నరికేసి చంపినట్లు తెలిసింది. ఇతడి హత్యకు ముందు గుర్తుతెలియని వ్యక్తులు ఇతడిని నీలం వ్యాలీలోని అతడి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి, ఆ తర్వాత తల నరికి హత్య చేశారు.

* లష్కరే మరో కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని 2023లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇతను ఉగ్రసంస్థ రిక్రూట్మెంట్‌లో కీలకంగా ఉండేవాడు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో, జమ్మూ కాశ్మీర్‌లో చొరబాట్లను ప్రోత్సహించడంలో ఇతనే కీలకం.

* 2023లోనే అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టు మిస్త్రీ జహూర్ ఇబ్రహీం కూడా ఇలాగే హతమయ్యాడు. 1999లో కాఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న ఐసీ -814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. జాహిద్ అఖుంద్ అనే నకిలీ ఐడెంటిటీతో జీవసి్తున్న ఇతడిని కరాచీలోని అక్తర్ కాలనీలో హతమర్చారు.