
YS Jagan: నెల్లూరు జిల్లా పర్యటనలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుని, తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులను ప్రారంభించామని తెలిపారు.
సుమారు రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో ఈ పనులను ప్రారంభించామని, మరో రూ.6 వేల కోట్లతో విస్తరణ పనులు పూర్తి చేయాలని సంకల్పించామని చెప్పారు. పోర్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక అనుమతులు కూడా పూర్తయ్యాయని వివరించారు. రామాయపట్నం పోర్టు 95 శాతం పనులు పూర్తయ్యాయని, శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టులో 35 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మచిలీపట్నం పోర్టు పనులు కూడా వేగంగా సాగాయని చెప్పారు జగన్.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 2024 మార్చిలో వర్చువల్గా ప్రారంభించామని, అన్ని పనులు పూర్తయినా ఇప్పటివరకు ఉపయోగంలోకి తేవలేదని జగన్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
మత్స్యకారులకు 1250 మెకనైజ్డ్ బోట్లు అందించాలని నిర్ణయించామని, ఒక్కో బోటుకు 12 మంది మత్స్యకారులు యజమానులు అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు వైఎస్ జగన్. తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ బోట్లు ఇప్పటికీ మత్స్యకారులకు అందేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారుల గురించి ఆలోచించడంలేదని జగన్ ఆరోపించారు. తమిళనాడు నుంచి వచ్చిన బోట్లు ఇక్కడ వేట చేస్తున్నాయని, స్థానిక మత్స్యకారుల సంపదను తరలించుకుంటున్నారని అన్నారు. వాటిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా, ప్రభావశీలుల జోక్యంతో విడిపించారని విమర్శించారు. జువ్వలదిన్నె ప్రాంతంలో ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీ కోసం భూములు కేటాయిస్తున్నారని, ఇది మత్స్యకారులకు అన్యాయం అని జగన్ అన్నారు. అవసరమైతే కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో భూములు ఇవ్వవచ్చని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తేనని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మళ్లీ వస్తే హార్బర్ పరిధిలోని మత్స్యకారులను మ్యాపింగ్ చేసి బోట్లు అందిస్తామని, ఈ ఫిషింగ్ హార్బర్ను పూర్తిగా వారికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే మత్స్యకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చివరగా, “దేవుడు అన్నీ చూస్తున్నాడు.. కళ్లుమూసుకుని తెరిచేలోపు మన ప్రభుత్వం వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..