
Hungary Election Results: హంగేరీ రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా ఉన్న సీనియర్ జాతీయవాద నేత విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ‘టిస్జా’ పార్టీకి చెందిన యువ సంచలనం పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు.
READ ALSO: Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!
రికార్డు మెజారిటీతో క్లీన్ స్వీప్
హంగేరీలోని 199 స్థానాలు గల శాసనసభలో పీటర్ మాగ్యార్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు తుది దశకు వచ్చేసరికి టిస్జా పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఏకంగా 138 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బుడాపెస్ట్లోని డాన్యూబ్ నది ఒడ్డున చేరిన వేలాది మంది మద్దతుదారుల మధ్య మాగ్యార్ తన విజయాన్ని ప్రకటించారు. “మనం సాధించాం! ఈ ఎన్నికల్లో టిస్జా – హంగేరీ గెలిచాయి. ఓర్బన్ పాలన నుంచి దేశానికి విముక్తి లభించింది” అని మాగ్యార్ చెప్పారు.
ఓర్బన్ ఓటమికి కారణాలు ఇవే..
“ఉదారవాద వ్యతిరేక ప్రజాస్వామ్యం” కి ప్రతిరూపంగా నిలిచిన ఓర్బన్ ఈసారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరైందన్న భావన దేశ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఆయనకు వ్యతిరేకంగా మాగ్యార్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడం ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్కు ఉపశమనం..
ఓర్బన్ ఓటమితో యూరోపియన్ యూనియన్ (EU) లో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. గతంలో ఉక్రెయిన్కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. ఇప్పుడు పీటర్ మాగ్యార్ అధికారంలోకి రావడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉందని సమాచారం. హంగేరీ తిరిగి యూరోపియన్ యూనియన్లో చేరడం వల్ల రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన ఓటమిని అంగీకరిస్తూ ఓర్బన్ భావోద్వేగ ప్రకటన చేశారు. “ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.