
Palnadu Police Crime: పల్నాడు జిల్లాలో వరుస ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు స్వయంగా నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట సమీపంలో రెండు రోజుల క్రితం జరిగిన న్యాయవాది హత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకట కోటయ్యకు హత్యకు గురైన లాయర్ భార్యతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న లాయర్ తరచూ భార్యతో గొడవపడుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం.
Read Also: Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!
ఈ పరిణామాలతో లాయర్ను అడ్డు తొలగించుకోవాలని వెంకట కోటయ్య కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావు సహకరించినట్లు వెల్లడైంది. ఇందుకోసం రూ.5 లక్షలు తీసుకుని హత్యలో సహకరించినట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరినీ చిలకలూరిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇక, పల్నాడు జిల్లాలో ఇటీవల పోలీసులపై వస్తున్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్త నుంచి వేరు చేసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించగా, అనంతరం ఆమెను తండ్రి, మేనబావ హత్య చేసిన కేసులో గత వారం మాచర్ల రూరల్ సీఐను సస్పెండ్ చేశారు.
అదేవిధంగా ప్రేమ జంటలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో మాచర్ల టౌన్ ఏఎస్ఐను ఐజీ నిన్న సస్పెండ్ చేశారు. వరుసగా పోలీసులపై నేర ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో పల్నాడు జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.