
రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత కొద్ది రోజులు క్రితం నుంచి ఒక లీటర్కు 60 కిలో మీటర్లు ఇచ్చే వాహనం మైలేజ్ తగ్గడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చి పెట్రోల్ పోసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే బంక్ నుంచి పెట్రోల్ సరిగ్గా వస్తున్నట్లుగానే గుర్తించాడు. దాంతో వెంటనే సమీపంలోని మెకానిక్ను సంప్రందించగా అతడు కూడా క్షుణ్ణంగా బండి పరిశీలించి ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పాడు. ఇటువంటి సమస్య కేవలం ఒక రాజుది అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే .నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా
వాహనాల్లో ఇంధనం 20 శాతం ఆవిరై పోతుండటంతో వాహనాల్లో గత వారం రోజులుగా మైలేజి తగ్గుముఖం పడుతోంది. వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఏ మాత్రం సరిపోవడం లేదు. పశ్చిమాసియా యుద్ద ప్రభావంతో వినియోగదారులు తమ వాహనాల్లో పెట్రోల్ను పూర్తి స్థాయిలో నింపుకోవడంతో గత కొద్ది రోజులుగా పెట్రోల్,డిజీల్ అమ్మకాలు బాగా పెరిగాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్ ,డీజిల్ బంకులు వుండగా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల డీజిల్,పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లలో సగటున 12 నుంచి 30వేల లీటర్ల సామర్థం కలిగి ఉన్నాయి.
వాహన ట్యాంక్లను పూర్తిగా నింపవద్దు ః
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పెట్రోల్ వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపవద్దు, సగం వరకు మాత్రమే నింపాలని అయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండా నింపితే ప్రమాదమని గతంలో ట్యాంక్ను పూర్తిగా నింపడం వల్ల ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గ్తురు చేశాయి.వాహనంలో పెట్రోల్ ఆవిరి కాకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనాలయితే పెట్రోల్ ట్యాంక్పై గుడ్డతో కూడిన ట్యాంక్ కవర్ను ఉపయోగించాలి. అంతే కాదు వాహనాన్ని ఎక్కువ సమయం ఎండలో నిలపకూడదని, కార్ల వంటి వాహనాలను కూడా ఎక్కవ సేపు ఎండలో ఉండకుండా చూడాలని , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి.