Reading Time: < 1 minute
Pakistan Defence Minister Threatens Kolkata Tmc Slams Bjp Modi Response

TMC: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇప్పుడు, పాకిస్తాన్ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మరోసారి భారత్ దాడి చేస్తే, కోల్‌కతాపై దాడులు చేస్తామని పాకిస్తాన్ బలుపు మాటలు మాట్లాడుతోంది.

ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ విరుచుకుపడ్డారు. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కోల్‌కతాపై దాడులు చేస్తామని హెచ్చరించినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇండియా కూటమి, మమతా బెనర్జీ కేంద్రంలో అధికారంలోకి వస్తే, పాకిస్తాన్లో వారి ఇళ్లలోకి వెళ్లి దాడులు చేస్తాం’’ అంటూ అభిషేక్ హెచ్చరించారు.

Read Also: Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

మరోవైపు, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కూడా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై మండిపడ్డారు. కోల్‌కతా వంటి నగరంపై దాడులు చేస్తామని బెదిరిస్తుంటే, కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ బెంగాల్‌ను గుర్తు చేసుకుంటుందని, ప్రజల భద్రతను పట్టించుకోదని ఆమె ఆరోపించారు.

పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారతదేశం తమపై దాడులకు పాల్పడితే, పాకిస్తాన్ త్వరగా, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కోల్‌కతా లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ముందు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆన్‌లోనే ఉందని, పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.