
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. భారత సైన్యం పాక్లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల భరతం పట్టింది. అయితే, పాక్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్లో కొందరు భారత జవాన్లు సైతం వీర మరణం పొందారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన భారత సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
మొత్తం ఆరుగురు జవాన్లు ఆపరేషన్ సింధూర్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఈ మేరకు వీర జవాన్ల పేర్లు, వివరాలను వెల్లడించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్, ఎయిర్ ఫోర్స్కు చెందిన సురేంద్ర కుమార్ వీరోచిత పోరాటంతో అమరులైనట్లు తెలిపింది.
దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సర్కిల్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకంలోని ప్రత్యేక గ్రెనైట్ పలకలపై వీరి పేర్లను శాశ్వతంగా చెక్కనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆపరేషన్ సింధూర్..!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.