
పాలమూరు జిల్లాకు ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ రానుందనే ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మిస్సైల్ యూనిట్ ఏర్పాటుకు సానుకూలంగా ఉండడంతో మరోసారి ఆసక్తికరంగా మారింది. ప్రతిపాదిత ప్రాంతంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతేడాది జూన్ 18న సీఎం రేవంత్ రెడ్డితో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ను విస్తరించాలని సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ – బెంగళూరు మధ్యలో మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో అవసరమైన ప్రభుత్వ స్థలం ఉందని వివరించారు. సీఎం వినతికి స్పందించిన ప్రతినిధులు ఆ తర్వాత మూడురోజుల్లోనే స్థల పరిశీలన చేసి నివేదిక రూపొందించారు.
అందుబాటులో 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి
వాస్తవంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వాయ్ పల్లి, చౌదర్ పల్లి గ్రామాల మధ్య సుమారు 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్, అనుబంధ సంస్థలకు అనుకూలంగా ఉంటుంది. NH 44, NH 167 కు మధ్యలో ఉన్న ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలతో ఇబ్బందులు లేవు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 100కిలో మీటర్ల దూరంలోనే ఉంది. గతేడాది స్థల పరిశీలన చేసిన అధికారులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. మిగతా ప్రాంతాల్లోనూ స్థల అన్వేషణ చేసినా DRDL బృందం పాలమూరు జిల్లా వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటు మరోసారి చర్చకు రావడంతో చౌదర్ పల్లి, బస్వాయిపల్లి గ్రామస్థుల్లో ఆశలు పెరిగాయి. దేశ రక్షణలో కీలకంగా మారిన మిస్సైల్ తయారీ తమ ప్రాంతంలో తయారు కావడాన్ని గర్వంగా ఫీల్ అవుతామంటున్నారు. అన్ని సౌకర్యాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు, ప్రాంత అభివృద్ధికి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.
త్వరలోనే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఏర్పాటు విషయంలో కేంద్రం అనుమతి వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అనుమతి వస్తే దేశ రక్షణ వ్యవస్థలో పాలమూరు ఖ్యాతి ఇమిడిపోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.