
సినిమా కోసం నటీనటులు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారని తరచూ వింటుంటాం. కానీ నిజ జీవితంలో ఓ తల్లి ప్రసవించే అత్యంత వ్యక్తిగత క్షణాన్ని కూడా సినిమా కథలో భాగంగా మార్చడం చాలా అరుదు. ప్రస్తుతం సమంత తన గర్భధారణను అధికారికంగా ప్రకటించి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో, గతంలో మరో హీరోయిన్ తీసుకున్న సంచలన నిర్ణయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లో జరిగిన మా ఇంటి బంగారం సినిమా విజయోత్సవ కార్యక్రమంలో సమంత తన గర్భధారణ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలకబోతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొంతకాలం ప్రసూతి సెలవు తీసుకుంటానని, ఆ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. ఈ ప్రకటనతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, గర్భవతిగా ఉన్నప్పటికీ షూటింగ్ కొనసాగించిన మరో నటి గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఆ నటి మరెవరో కాదు మలయాళ సినీ నటి శ్వేతా మీనన్. గర్భధారణ సమయంలోనే ఆమె నటించిన కలిమన్ను చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అరుదైన ప్రయోగంగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే శ్వేతా మీనన్ నిజ జీవితంలో గర్భవతిగా ఉండేది. 2012 సెప్టెంబర్ 28న ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఇక్కడే ఈ కథ ప్రత్యేక మలుపు తిరిగింది. సాధారణంగా సినిమాల్లో ప్రసవ దృశ్యాలను నటీనటులతో చిత్రీకరిస్తారు. కానీ కలిమన్ను చిత్రబృందం మాత్రం శ్వేతా మీనన్ నిజంగా ప్రసవిస్తున్న సమయంలోనే ఆ దృశ్యాలను కెమెరాలో బంధించింది. ఆపరేషన్ థియేటర్లో ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రసవ సమయంలో ఆమె అనుభవించిన నొప్పి, బాధ, భావోద్వేగాలన్నింటినీ యథాతథంగా చిత్రీకరించారు. తర్వాత అవే దృశ్యాలను సినిమాలో ఉపయోగించారు. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
ఒక మహిళ జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన, సున్నితమైన క్షణాన్ని వాణిజ్య సినిమా కోసం ఉపయోగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు అప్పట్లో బలంగా వినిపించాయి. మహిళా హక్కుల సంఘాలు, కొన్ని రాజకీయ సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేరళలోని కొందరు థియేటర్ యజమానులు ప్రసవ దృశ్యాలను తొలగించకపోతే సినిమాను ప్రదర్శించబోమంటూ హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు కొందరు మాత్రం తల్లితనాన్ని అత్యంత సహజంగా, నిజాయితీగా చూపించే ప్రయత్నమిదేనని దర్శకుడు, నటిని సమర్థించారు. దీంతో కలిమన్ను సినిమా కళాత్మక స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యత మధ్య సరిహద్దులపై దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.
శ్వేతా మీనన్ కేవలం నటిగానే కాదు, అందాల పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. 1994లో ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ కిరీటాన్ని గెలుచుకున్న ఆమె మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లోనూ నటించారు. ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కూడా అందుకున్నారు.
ఇటీవల మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అయిన అమ్మలో చోటుచేసుకున్న అంతర్గత వివాదాల మధ్య శ్వేతా మీనన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గత నాయకత్వంపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు తమ కమిటీ ప్రయత్నించినా కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఇదే సమయంలో సంస్థలో నటి అన్సిబా హసన్ నటుడు టిని టామ్పై చేసిన ఆరోపణలు కూడా మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య శ్వేతా మీనన్ పేరు మరోసారి వార్తల్లో నిలవడం విశేషం.