Reading Time: < 1 minute
Varanasi Shoot Update Ss Rajamouli Completes Major Action Scenes Mahesh Babu Film Nears Wrap

Varanasi Shoot Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి జక్కన్న తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే సినిమా ప్రధాన భాగానికి చెందిన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘షూటింగ్‌లో ప్రధాన భాగం పూర్తయ్యింది. సినిమాలోని భారీ విజువల్ స్పెక్టకిల్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ చిత్రీకరించాం. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది’ అని తెలిపారు. ఇక మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదని, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చివరగా అక్టోబర్ తొలి వారంలో పూర్తి చేస్తామని రాజమౌళి చెప్పారు. జక్కన్న తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇప్పటికే వారణాసి చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ విజువల్స్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్‌లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న వారణాసి భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను చిత్రబృందం వేగవంతం చేయనుంది. 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి విడుదల కానుంది.