
NRI : మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా… ఎంత సంపద సంపాదించినా… ఎన్ని దేశాలు చూసినా… చివరికి మనసు మాత్రం పుట్టిన నేలనే వెతుక్కుంటుంది. జీవితాంతం ప్రపంచాన్ని చూసిన కళ్లకూ చివరికి కావాల్సింది చిన్నప్పుడు నడిచిన ఆ ఊరి వీధులే. చివరి శ్వాస తీసుకునే క్షణంలో కూడా తనను తాను ఈ నేల బిడ్డగానే పిలిపించుకోవాలని కోరుకునే మనసు ముందు ప్రపంచంలో ఏ పౌరసత్వమైనా చిన్నదే. ఇప్పుడు అలాంటి హృదయాన్ని కదిలించే కథ ఆంధ్రప్రదేశ్ నుంచి వెలుగులోకి వచ్చింది.
బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రగుంట మహాలక్ష్మమ్మ వయసు ఇప్పుడు 94సంవత్సరాలు. ఆమె జీవితంలో ఇప్పుడు ఒక్కటే కోరిక మిగిలింది. తాను భారతీయురాలిగానే చివరి శ్వాస తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నారు. తన అంత్యక్రియలు కూడా తన పుట్టిన ఊరిలోనే జరగాలని అధికారులను వేడుకుంటున్నారు.
మహాలక్ష్మమ్మ భర్త నాగభూషణం మరణించిన తర్వాత ఆమె తన కుమారుడు డాక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య చౌదరి దగ్గర ఉండేందుకు అమెరికాకు వెళ్లారు. వర్జీనియా రాష్ట్రంలోని పీటర్స్బర్గ్ నగరంలో నివసిస్తూ జూలై 27,2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. ప్రముఖ క్యాన్సర్ నిపుణుడైన తన కుమారుడితో కలిసి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అక్కడే జీవించారు.
అయితే కాలం గడిచేకొద్దీ ఆమె మనసు మాత్రం పుట్టిన ఊరిని మరిచిపోలేకపోయింది. విదేశాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నా… చిన్ననాటి జ్ఞాపకాలు పిలుస్తూనే ఉన్నాయి. చివరకు 2018లో కుటుంబంతో కలిసి తిరిగి చింతగుంపల గ్రామానికే వచ్చేశారు. ప్రస్తుతం ఆమె కుమారుడు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్ గా సేవలందిస్తుండగా మహాలక్ష్మమ్మ మాత్రం తన స్వగ్రామంలోనే నివసిస్తున్నారు.
అమెరికా పౌరసత్వాన్ని కూడా స్వచ్ఛందంగా వదులుకున్న మహాలక్ష్మమ్మ మరోసారి భారత పౌరసత్వం పొందాలని ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు పరిశీలనలో భాగంగా బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఎదుట హాజరైన ఆమె చేతులు జోడించి చేసిన విజ్ఞప్తి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
తాను 95సంవత్సరాల వయసుకు చేరుకుంటున్నానని… తన చివరి రోజులు భారతీయురాలిగానే గడపాలని ఉందని… తన చివరి శ్వాస కూడా ఈ మాతృభూమిపైనే విడవాలని ఉందని… తన అంత్యక్రియలు తన పుట్టిన ఊరిలోనే జరగాలని ఉందని ఆమె భావోద్వేగంతో కోరారు. ఇప్పటికే అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నానని… వీలైనంత త్వరగా భారత పౌరసత్వాన్ని కల్పించాలని అధికారులను వేడుకున్నారు.
పౌరసత్వం మంజూరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశంలోని అన్ని చట్టాలను తప్పకుండా పాటిస్తానని కూడా ఆమె అధికారులకు హామీ ఇచ్చారు. తాను పుట్టిన దేశంలోనే మిగిలిన జీవితాన్ని చట్టబద్ధంగా గడిపే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
మహాలక్ష్మమ్మ విజ్ఞప్తికి స్పందించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ దరఖాస్తు ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో విచారణ పూర్తిచేసి నివేదికను అమరావతిలోని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని… అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చేరిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. త్వరలోనే మహాలక్ష్మమ్మకు భారత పౌరసత్వం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విచారణ సమయంలో మహాలక్ష్మమ్మతో పాటు ఆమె కుమారుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి కూడా హాజరయ్యారు. ఆయన ఇప్పటికే భారత పౌరసత్వాన్ని స్వీకరించారు.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… మనిషి గుండె చప్పుడు చివరికి పుట్టిన నేల కోసమే కొట్టుకుంటుందనడానికి మహాలక్ష్మమ్మ కథ మరోసారి గుర్తు చేస్తోంది. పాస్ పోర్టులు మారవచ్చు… దేశాలు మారవచ్చు… కానీ పుట్టిన మట్టితో ఉండే అనుబంధం మాత్రం ఎప్పటికీ మారదని ఈ 94ఏళ్ల తల్లి కన్నీళ్లు ప్రపంచానికి మరోసారి చెబుతున్నాయి.