
డ్రగ్స్ రహిత తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈగల్ ఫోర్స్ ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ ఉనికిని పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఈ ఫోర్స్కు ప్రభుత్వం అన్ని రకాల పూర్తి అధికారాలను కట్టబెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం అని అన్నారు.
శిల్పకలావేదికలో జరిగిన ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తూనో, వాడుతూనో దొరికితే ఎంతటి వారైనా సరే… కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. తల్లిదండ్రుల కలలను యువత డ్రగ్స్ బారిన పడి నాశనం చేసుకోవద్దు. జీవితం చాలా విలువైనది. క్షణికానందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దు. ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయడమే మా లక్ష్యం. మా పిల్లల భవిష్యత్తే… ఈ రాష్ట్ర భవిష్యత్. ఆ భవిష్యత్తుకు ఎవరు ఆటంకం కలిగించినా… ఎంతమాత్రం ఉపేక్షించేది లేదు అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.
►ALSO READ | తెలంగాణ సీఎంఓలో కీలక మార్పులు..సీఎం సలహాదారుగా రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్
అంతేకాదు, ఈ సామాజిక మహమ్మారిపై పోరాటంలో సినిమా రంగాన్ని కూడా ఆయన భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. సినీ హీరో, హీరోయిన్లు డ్రగ్స్కు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేయాలని… థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు తప్పనిసరిగా యాంటీ డ్రగ్స్ ప్రకటనలను ప్రదర్శించాలని ఆయన కోరారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు, డ్రగ్స్ ముఠాల గుండెల్లో వణుకు పుట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.