
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ల చాటింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేందుకు మెటా సంస్థ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో ఒక ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. నిత్యం అదనపు ఫీచర్లు, అద్భుతమైన కస్టమైజేషన్ ఆప్షన్లు కోరుకునే వారి కోసం ఈ సర్వీసులను డిజైన్ చేశారు.
రూ.79 లకే సబ్స్క్రిప్షన్..
ఈ సరికొత్త ‘వాట్సాప్ ప్లస్’ సేవలను పొందడం ఎంతో సులభం. వినియోగదారులు తమ వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి, అక్కడ కనిపించే ‘వాట్సాప్ ప్లస్’ ఆప్షన్ను ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రీమియం సేవల కోసం మెటా సంస్థ నెలకు కేవలం రూ.79 సబ్స్క్రిప్షన్ ఛార్జ్ వసూలు చేస్తోంది. ఒకవేళ ఈ సేవలు నచ్చకపోయినా లేదా అవసరం లేదు అనుకున్నా.. వినియోగదారులు తమకు నచ్చినప్పుడు, ఎప్పుడైనా ఈ సబ్స్క్రిప్షన్ను ఎలాంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
‘వాట్సాప్ ప్లస్’ లో లభించే అద్భుతమైన ఫీచర్లు..
ఈ పెయిడ్ సర్వీస్ ద్వారా సాధారణ వాట్సాప్లో లేని ఎన్నో సరికొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సాధారణ వాట్సాప్లో కేవలం 3 ముఖ్యమైన చాట్స్ లేదా గ్రూప్లను మాత్రమే స్క్రీన్ పైన పిన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ, వాట్సాప్ ప్లస్లో ఏకంగా 20 గ్రూప్స్ లేదా చాట్స్ను పిన్ చేసుకోవచ్చు. ఆఫీస్, ఫ్యామిలీ గ్రూపులు ఎక్కువగా వాడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

ఎప్పుడూ ఒకే రకమైన గ్రీన్ కలర్ లోగో చూసి బోర్ కొట్టిన వారికి ఇది గుడ్ న్యూస్. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ లోగోను మీకు నచ్చిన రంగులోకి మార్చుకోవచ్చు. చాట్ లోపల ఉండే టెక్ట్స్ బబుల్స్, మెసేజ్ పంపినప్పుడు వచ్చే టిక్స్, బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ వంటి వాటన్నింటినీ మనం ఎంపిక చేసుకునే ప్రత్యేక థీమ్ లోకి పూర్తిగా మార్చుకోవచ్చు. మనకు నచ్చిన థీమ్తో పాటు విభిన్నమైన రింగ్టోన్లు, నోటిఫికేషన్ టోన్లను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. వీటితో పాటు.. చాటింగ్ను మరింత సరదాగా మార్చేందుకు వాట్సాప్ ప్లస్ యూజర్ల కోసం ప్రత్యేకమైన యానిమేషన్తో కూడిన స్టిక్కర్లను మెటా ఇందులో జోడించింది. సాధారణ వాట్సాప్ ఫీచర్లతో విసిగిపోయి, సరికొత్త లుక్ అండ్ ఫీచర్స్ కోరుకునే స్మార్ట్ఫోన్ ప్రియులకు ఈ ‘వాట్సాప్ ప్లస్’ ఒక సరికొత్త డిజిటల్ అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.