
Hyderabad: హైదరాబాద్ నగరాన్ని కల్తీ ఆహార పదార్థాల మాఫియా కుదిపేస్తోంది. వరుస దాడుల్లో కల్తీగాళ్ల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ కల్తీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాసిరకం నూనెలు, కాలం చెల్లిన పిండి పదార్థాలు, ప్రమాదకర రసాయనాలతో ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్న కేటుగాళ్లు నగర ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల సంయుక్త దాడుల్లో మైలార్దేవ్పల్లి పరిధిలో కల్తీ మిక్చర్, బిస్కట్లు, చిక్కీలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మిగూడ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గోదాములపై దాడులు నిర్వహించగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ప్రమాదకర రసాయనాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ ఫుడ్ కంపెనీ పేరుతో అనుమతులు లేకుండా మిక్చర్, బూందీ తయారు చేస్తుండగా, అంజని ఫుడ్స్ పేరిట ఉస్మానియా బిస్కట్లు, చిక్కీలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే జైన్ ఫుడ్స్ పేరుతో నమ్కీన్, మిక్చర్ తయారీ కూడా జరుగుతున్నట్లు తేలింది. ఈ కల్తీ ఉత్పత్తుల్లో హానికరమైన రంగులు, రసాయనాలు ఉపయోగించి తయారు చేసి హోల్సేల్ పేరుతో మార్కెట్లోకి పంపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగరంలోని వందలాది కిరాణా దుకాణాలు, బేకరీలకు ఈ నకిలీ ఆహార పదార్థాలు సరఫరా అవుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నాణ్యత లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
READ MORE: Virat Kohli: ఒకే ఫార్మాట్ ఎందుకు.. అసలు రహస్యాన్ని వెల్లడించిన విరాట్ కోహ్లీ!