Reading Time: < 1 minute
Chicken Prices Hike Telangana Andhra Pradesh Ramzan Season

తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఆదివారం అంటేనే పండుగ. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కంచంలో చికెన్ ముక్క కనిపించడం కాస్త భారంగానే మారేలా ఉంది. ఆదివారానికి ఒక్క రోజు ముందుగానే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కిలో రూ.330 పలికిన చికెన్, ఇప్పుడు ఏకంగా రూ.70 నుంచి రూ.80 వరకు పెరిగి సామాన్యుడి బడ్జెట్‌కు చిల్లు పెడుతోంది.

ప్రస్తుతం విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలోకు రూ.380 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది; ఇక్కడ కిలో ధర రూ.340 నుంచి రూ.350 మధ్యలో ఉంది. ఇక నాటుకోడి విషయానికి వస్తే, ధరలు వింటేనే నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. కేజీ బరువుండే నాటుకోడి ధర సుమారు రూ.800 మార్కును తాకింది. చికెన్ రేట్లు ఇలాగే పెరిగితే, త్వరలోనే అర కిలో మటన్ ధరతో ఇది పోటీ పడటం ఖాయమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Iran-US War Ending: ట్రంప్ కీలక ప్రకటన.. ‘ఇరాన్‌తో యుద్ధం ముగించే ఆలోచన ఉంది’..

అకాల ఎండల వల్ల పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీనివల్ల మార్కెట్‌లోకి రావాల్సిన స్టాక్ తగ్గి, డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవడంతో డిమాండ్ రెట్టింపు అయ్యింది. డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావంతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా (Feed) ధరలు కూడా అధికం కావడంతో పౌల్ట్రీ రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో రేట్లు పెంచాల్సి వస్తోంది.

చికెన్ ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకోవడంతో.. చాలామంది ఇప్పుడు చేపలు, రొయ్యలు వంటి సీ-ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్‌తో పోలిస్తే చేపల ధరలు కొంత అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. ఎండలు తగ్గుముఖం పట్టే వరకు లేదా కోళ్ల ఉత్పత్తి పెరిగే వరకు ఈ ధరల నుంచి ఉపశమనం లభించడం కష్టమే.