Reading Time: < 1 minute
Mamata Banerjee Letter To Cec Bengal Officers Transfer Row

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా కీలక అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. కీలకమైన డీజీపీ, సీఎస్‌, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వంటి పోస్టుల్లో పనిచేస్తున్న వారిని తొలగించి, వేరే వారికి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు, ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈసీ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.

Read Also: Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ చర్యలు ‘‘ఏకపక్షమైనవి’’, ‘‘తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు’’ అని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఏకపక్ష చర్యలు తీసుకోకుండా ఉండాలని ఆమె లేఖలో రాశారు. ఇలాంటి మార్పులు చేసే అధికారం కమిషన్‌కు ఉన్నప్పటికీ, గత ఎన్నికల సమయంలో “రాజ్యాంగ సముచితం, పరిపాలనా సంప్రదాయం ప్రకారం వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు” అని బెనర్జీ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం చర్య ఎన్నికల సంఘం విశ్వసనీయత, సంస్థాగత సమగ్రతను నీరుగార్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తుందని చెప్పారు.

ఎన్నికల తేదీలను ప్రకటించిన కొద్దిసేపటికే, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, రాష్ట్ర పోలీసు అధిపతి పీయూష్ పాండే, కోల్‌కతా పోలీసు కమిషనర్ సుప్రతీమ్ సర్కార్, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శి జగదీష్ ప్రసాద్ మీనాలను ఎన్నికల సంఘం తొలగించింది. దీనిపై మమతా బెనర్జీ ఆగ్రహంగా ఉన్నారు. ఇదే కాకుండా ఈ అధికారులకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని ఎన్నిక సంఘం ఆదేశించింది. సమర్థులైన బెంగాలేతర అధికారుల్ని కూడా ఈసీ తొలగించిందని, కేవలం బీజేపీ చెప్పినట్లు నడుచుకునే వారిని మాత్రమే ఎంపిక చేసిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.