Reading Time: < 1 minute

‘యువసాథీ’ పథకాన్ని అమల్లోకి తెచ్చిన మమత

21-40 ఏళ్ల వారికి పథకం వర్తింపు

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు సాక్ష్యాలతో బయటపెడతానని ప్రకటన

కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ యువతపై వరాల జల్లు కురిపించారు. యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ప్రకటించారు. శనివారంనాడు కోల్‌కతాలో ‘సర్’కు వ్యతిరేకగా నిర్వహించిన ధర్నాలో మమత ప్రసంగించారు. పదో తరగతి పాసై ఎలాంటి ఉద్యోగం లేని వారికి నెలకు ‘యువసాథీ’ పథకం కింద రూ.1500 వాళ్ల ఖాతాల్లో వేస్తామని, అది శనివారంనాటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు మమత తెలిపారు. తొలుత ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని భావించామని, అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగితను రూపుమాపేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని, వాటిల్లో పరిశ్రమలు, నిరుద్యోగ యువతను వెబ్‌సైట్లతో అనుసంధానం చేసే కార్యక్రమం గొప్ప విజయం సాధించిందన్నారు. తద్వరా ఎన్నో లక్షల మందికి ఆయా పరిశ్రమలు ఉపాధి కల్పించడం సులువైందన్నారు. బెంగాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరిట పెద్దఎత్తున ఓటర్లను తొలగించడాన్ని మమత తీవ్రంగా దుయ్యబట్టారు. ధర్నాలో దీదీ మాట్లాడుతూ.. బిజెపి, ఎలక్షన్ కమిషన్‌లు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను త్వరలోనే బయటపెడతానని, సవరించిన జాబితాలో చాలా మంది చనిపోయినట్టు తప్పుగా ప్రకటించారన్నారు. కానీ వారంతా బతికే ఉన్నారని, వారందరినీ వేదికపైకి తీసుకువచ్చి అవకతవకలన్నింటీ బహిర్గతం చేస్తానని మమత వెల్లడించారు.