
Child Murder : హైదరాబాద్లోని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యంత శోకతప్తమైన, దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారి, మద్యం మత్తులో తొమ్మిది నెలల పసికందును నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. బైరామల్గూడ చెరువు వేదికగా జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
మద్యానికి బానిసై.. ప్రాణం తీసి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్ ప్రాంతానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళకు తొమ్మిది నెలల కుమార్తె ‘లోకసాని అనురాధ’ ఉంది. తీవ్రంగా మద్యానికి బానిసైన రాజేశ్వరి, సంఘటన జరిగిన సమయంలోనూ పూర్తి మద్యం మత్తులో ఉంది. ఆ మత్తులో విచక్షణ కోల్పోయిన ఆమె, కనీస మానవత్వం లేకుండా తన తొమ్మిది నెలల చిన్నారి అనురాధను బైరామల్గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి దారుణంగా హత్య చేసింది.
కేసు నమోదు.. విచారణలో పోలీసులు
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని చెరువులో నుండి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో నిందితురాలు రాజేశ్వరి తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల పూర్తి కారణాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.