Reading Time: < 1 minute
Nitish Kumar Reddy Returns To Hometown After Four Years Gifts Gold Bangles To Grandmother

భారత క్రికెట్ జట్టు యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత తన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని తుంగ్లంకు వెళ్లాడు. ఐపీఎల్‌లో ఎంపికైన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన నితీశ్ రెడ్డి.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం అందుకున్నాడు. స్వగ్రామ పర్యటనలో భాగంగా నితీశ్ తన నానమ్మను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా నానమ్మకు బంగారు గాజులు తొడిగి ప్రేమాభిమానాలను చాటుకున్నాడు. కుటుంబ సభ్యులతో గడిపిన ఈ క్షణాలు అతడికి ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి.

స్వగ్రామం వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నితీశ్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘చాలా సంవత్సరాల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు ముడిపడిన స్వగ్రామానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడే నా బాల్యం గడిచింది. ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నేను ఈ స్థాయికి చేరుకోవడంలో నా తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. చిన్నప్పటి నుంచి నా కలలను నమ్మి, అన్ని విధాలుగా ప్రోత్సహించారు. వారి త్యాగాలు, కష్టాల ఫలితంగానే నేడు భారత జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది’ అని నితీశ్ భావోద్వేగంగా చెప్పాడు.

‘భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ నాకు గొప్ప స్ఫూర్తి. కోహ్లీ ఆటతీరు, అంకితభావం, ఫిట్‌నెస్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. కోహ్లీని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌లో ముందుకు సాగా. భారత జట్టులో నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. దేశం కోసం ఇంకా ఎన్నో సేవలు అందించాల్సి ఉంది. జట్టులో స్థిరమైన స్థానం సంపాదించి భారత క్రికెట్‌కు మరిన్ని విజయాలు అందించడమే నా లక్ష్యం’ అని నితీశ్ రెడ్డి స్పష్టం చేశాడు. స్వగ్రామంలో నితీశ్ రెడ్డికి లభించిన ఆదరణ స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. తమ ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటంపై గ్రామస్తులు గర్వం వ్యక్తం చేస్తున్నారు. నితీశ్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.