Reading Time: < 1 minute
కన్న బిడ్డను అమ్మేసింది.. భర్తతోనే పెళ్లి పనులు చేయించింది.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే మోసం చేసింది. తామిద్దరి ప్రేమకు గుర్తుగా పుట్టిన బిడ్డను కన్నతల్లే అమ్మేసింది. అంతటితో ఆగక, వేరే పెళ్లి చేసుకుంటూ.. ఆ పెళ్లి పనులను కూడా తనతోనే చేయించింది. ఈ ఘోర అవమానాన్ని, గుండెకోతను తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ పరిధిలోని కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు, సరిత అనే యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా జన్మించింది. అయితే, కొద్దిరోజుల క్రితం సరిత మనసు మార్చుకుంది. గోవర్ధన్‌ను కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. ఈ క్రమంలో తనకు అడ్డంగా ఉన్నాడనే నెపంతో కన్నబిడ్డను కూడా అమ్మేసింది.

సరిత వేరే పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలిసి గోవర్ధన్ తట్టుకోలేకపోయాడు. తనతో వచ్చేయాలంటూ ఆమెను ఎన్నోసార్లు బతిమాలాడు. కానీ, సరిత నయవంచనతో గోవర్ధన్‌ను మరింత క్షోభకు గురిచేసింది. తన పెళ్లి పనులను కూడా గోవర్ధన్ చేతనే చేయించి రాక్షసానందం పొందింది. ఈ తీవ్ర అవమానంతో గోవర్ధన్ మనస్తాపానికి గురయ్యాడు.

మంగళవారం (మే 12) నైట్ డ్యూటీ ముగించుకుని బుధవారం ఉదయం 10:30 గంటలకు గోవర్ధన్ ఇంటికి వచ్చాడు. సాయంత్రమైనా అతను గదిలోంచి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన సోదరి, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసింది. అప్పటికే గోవర్ధన్ ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు ముందు గోవర్ధన్ అత్యంత ఆవేదనతో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. “నా చావుకు కారణమైన సరితను అస్సలు వదిలిపెట్టొద్దు” అంటూ ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు.

గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సరిత అమ్మేసిన ఆ పసిబిడ్డ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదని, బిడ్డ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ప్రేమించిన వాడే ప్రాణంగా బతికిన యువకుడిని మోసం చేసి, కన్నబిడ్డను అమ్ముకున్న సరితపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..