దేశం గర్వించేలా రోడ్లు నిర్మిస్తున్నం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

- ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
- ఇబ్రహీంపట్నంలో రూ.338 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలను దేశం గర్వించేలా చేపడుతున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో హమ్ విధానంలో చేపట్టనున్న ఫోర్ లేన్ రోడ్ల నిర్మాణ పనులకు రంగారెడ్డి జిల్లా తొర్రూర్ గ్రామంలో మంత్రి శంకుస్థాపన చేశారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్, చామల కిరణ్కుమార్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లతో కలిసి అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇప్పటికే రూ.85 కోట్ల విలువైన రోడ్డు వర్క్స్ పూర్తి చేశామని, ప్రస్తుతం మరో రూ.275 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తున్నామని వివరించారు. ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతుల ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి..
రోడ్ల కోసం మంజూరైన నిధుల్లో అధిక శాతం ఇబ్రహీంపట్నం పరిధిలోనే చేపట్టే పనులకు కేటాయించినట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో 200 పడకల (బెడ్స్) హాస్పిటల్, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.