July 8, 2026

Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..

Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
Reading Time: 2 minutes
Shreyas Iyer Joins Virat Kohli And Ms Dhoni With Rare India T20i Toss Record

Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన అయ్యర్, భారత టీ20 కెప్టెన్ల జాబితాలో ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు. మూడో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలిచిన భారత టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో వరుస టాస్ విజయాల్లో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. భారత టీ20 కెప్టెన్లలో వరుసగా అత్యధిక టాస్ విజయాల జాబితాలో ప్రస్తుతం ధోనీ (7) అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (6) రెండో స్థానంలో ఉన్నాడు. ఐదేసి వరుస టాస్ విజయాలతో రోహిత్ శర్మ, ధోనీ (2007), శ్రేయస్ అయ్యర్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

మూడో టీ20లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్, రెండో టీ20లో ఎదురైన ఓటమిని చిన్న ఎదురుదెబ్బగా అభివర్ణించాడు. అలాంటి పరిస్థితులు ప్రతి ఆటగాడి కెరీర్‌లో వస్తాయని, బౌలర్లపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పాడు. జట్టులో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం బాగానే ఉందని, ప్రతి అనుభవం భవిష్యత్తుకు పాఠంగా మారుతుందని పేర్కొన్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని కూడా అభిప్రాయపడ్డాడు.

కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా మరోసారి తీవ్ర నిరాశపరిచింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో పాటు భారత జట్టు ఒక చెత్తి రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఫిల్ సాల్ట్ దూకుడైన ఇన్నింగ్స్‌తో పాటు సామ్ కరన్ కీలక పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. భారత బౌలర్లు కీలక సమయంలో పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఇక, 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. పవర్‌ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ టీ20 చరిత్రలో తొలిసారి ఈ అవాంఛనీయ రికార్డును నమోదు చేసింది. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోవడంతో భారత్ కోలుకోలేకపోయింది. ఫలితంగా భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకున్న విషయం విదితమే..

భారత కెప్టెన్ల వరుస టాస్ విజయాలు (టీ20లు)
* 7 – మహేంద్ర సింగ్ ధోనీ (మే 2010 – ఫిబ్రవరి 2012)
* 6 – విరాట్ కోహ్లీ (ఆగస్టు 2019 – డిసెంబర్ 2019)
* 5 – రోహిత్ శర్మ (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)
* 5 – మహేంద్ర సింగ్ ధోనీ (సెప్టెంబర్ 2007)
* 5 – శ్రేయస్ అయ్యర్ (జూన్ 2026 – జూలై 2026)