
బాలీవుడ్ స్టార్ కపుల్ రితేష్ దేశ్ముఖ్, జెనీలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చారిత్రక చిత్రం ‘రాజా శివాజీ’. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించాలనే తన పదేళ్ల కలని రితేష్ ఈ సినిమాతో సాకారం చేసుకున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులలో గూస్బంప్స్ తెప్పిస్తోంది.
అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రితేష్ దేశ్ముఖ్ మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం పడ్డ కష్టం, తన భార్య జెనీలియా అందించిన సహకారం గురించి చెబుతుంటే.. పక్కనే ఉన్న జెనీలియా కూడా ఎమోషన్ ఆపుకోలేక వేదికపైనే చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ సినిమాలో మరో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇందులో ‘జీవ మహాల’ అనే పవర్ఫుల్ పాత్రను పోషించారు. వీరితో పాటు.. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. సచిన్ ఖేడేకర్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ, జితేంద్ర జోషి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మొత్తనికి స్టార్స్ అందరూ ఒకే వేదికపైకి వచ్చి రితేష్ కలల ప్రాజెక్టుకు మద్దతు తెలపడం విశేషం.
కాగా మరాఠీ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీని మే 1, 2026న (మహారాష్ట్ర డే సందర్భంగా) థియేటర్లలో విడుదల చేయనున్నారు. అజయ్-అతుల్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. ఒక నటుడిగానే కాకుండా, ఒక దర్శకుడిగా రితేష్ తన ప్రతిభను ఈ సినిమాతో మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.