
MLA Pulivarthi Nani: తిరుపతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై త్వరలోనే పూర్తి వివరాలు బయటపెడతామని హెచ్చరించారు. తమ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. తండ్రి పేరును అడ్డం పెట్టుకుని సంపాదన చేసుకుంటూ గర్వంతో ప్రవర్తిస్తున్నారని చెవిరెడ్డి కుటుంబంపై మండిపడ్డారు. ముఖ్యంగా మోహిత్ రెడ్డి చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు నారా లోకేష్ పేరు ఎత్తితే చూస్తూ ఊరుకోమని, తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
Read Also:
చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, దందాలు అన్నింటినీ త్వరలో ప్రజల ముందుకు తీసుకువస్తామని నాని తెలిపారు. వారంలోనే చెవిరెడ్డికి “సినిమా చూపిస్తా” అంటూ రాజకీయంగా కౌంటర్ ఇచ్చారు. కొంతమంది మాటలు కొండను చూసి కుక్క మొరిగినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడని, అందుకే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు వచ్చాయని పేర్కొన్నారు. లోకేష్పై విమర్శలు చేసే ముందు ఆయన పని తీరును చూడాలని సూచించారు.
ఇక చెవిరెడ్డి కుటుంబంపై మరోసారి మండిపడిన నాని, వెన్నుపోటు రాజకీయాలకు ఆ కుటుంబమే ప్రతీక అని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి, వేమిరెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారిని కూడా మోసం చేసిన చరిత్ర ఉందన్నారు. వెన్నుపోటు అంటే గుర్తుకు వచ్చేది చెవిరెడ్డి కుటుంబమేనని వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయల మద్యం డబ్బులు లెక్క పెడుతున్న వీడియోల్లో కనిపించిన నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తుడా వ్యవహారంలో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, సహకరించిన అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. దొంగ ఓట్ల కేసు త్వరలో బయటపడుతుందని, 15 ఏళ్లకే ఎన్నికల్లో దొంగ ఓటు వేసిన ఘటనలు వెలుగులోకి వస్తాయని నాని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరని, వెంట్రుక కూడా పీకలేరని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పులివర్తి నాని..