
ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన చేసింది. ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 222 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. ఫిల్ సాల్ట్ (78 పరుగులు; 36 బంతుల్లో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రజత్ పాటీదార్ (53 పరుగులు; 20 బంతుల్లో) మెరుపు అర్ధ శతకం చేయగా.. విరాట్ కోహ్లీ (50 పరుగులు; 38 బంతుల్లో) రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోరును నమోదు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్ రికెల్టన్ (37 పరుగులు; 22 బంతుల్లో) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ (19 పరుగులు; 13 బంతుల్లో) తొడ కండరాల గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. రోహిత్ నిష్క్రమణతో ముంబై ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. ఆ వెంటనే సుయాశ్ శర్మ వేసిన ఒకే ఓవర్లో రికెల్టన్, తిలక్ వర్మ (1) అవుట్ కావడంతో ముంబై కష్టాల్లో పడింది.
Also Read: Hardik Pandya: ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.. ముంబై ఓటములపై హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మధ్యలో సూర్యకుమార్ యాదవ్ (33 పరుగులు; 22 బంతుల్లో), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (40 పరుగులు; 22 బంతుల్లో ) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే రన్ రేట్ అంతకంతకు పెరిగిపోవడంతో ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరు పెవిలియన్ చేరారు. నమన్ ధీర్ (1) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. ఆఖర్లో రూథర్ఫర్డ్ (71 నాటౌట్; 31 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రూథర్ఫర్డ్ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్ కారణంగానే ముంబై ఓడిపోయిందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.