
కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ను, బ్రాండ్ను సృష్టించుకున్నారు. శేష్, ఇటీవల ఒక కాలేజీ ఈవెంట్లో తనకు ఎదురైన ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకుంటూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమంటే అడివి శేష్ ఒక కాలేజీ వేడుకకు మరో ఇద్దరు యంగ్ హీరోలతో కలిసి వెళ్ళారట. అక్కడ పేర్లు పిలుస్తున్నప్పుడు మిగతా ఇద్దరు హీరోల పేర్లకు వచ్చిన రెస్పాన్స్, ఈలలు, కేకలతో పోలిస్తే శేష్ పేరుకు వచ్చిన సౌండ్ చాలా తక్కువగా ఉందట, ఆ సమయంలో ఎవరైనా సరే.. ఆ ఇద్దరు హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉందని భావిస్తారు. కానీ, అసలు ట్విస్ట్ నెల రోజుల తర్వాత తెలిసింది. ఆ ముగ్గురు హీరోల సినిమాలు వరుసగా విడుదలయ్యాయి కానీ ఈవెంట్లో ఎవరికైతే తక్కువ అరుపులు వినిపించాయో, అదే అడివి శేష్ సినిమాకు మిగతా ఇద్దరి సినిమాల కంటే రెట్టింపు ఓపెనింగ్స్ వచ్చాయి.
Also Read : Drama Juniors : ఏప్రిల్ 12న డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్
స్టేజ్ మీద ఒక హీరోని చూసి అరవడమే క్రేజ్ అనుకుంటే పొరపాటే. ప్రేక్షకులు ఈలలు వేయడానికి ఒక హీరోని, టికెట్ కొని సినిమా చూడటానికి మరో హీరోని ఎంచుకుంటారు. ఆ హీరో సినిమాకు వెళ్తే కచ్చితంగా మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకమే బాక్సాఫీస్ దగ్గర టికెట్లు తెగేలా చేస్తుందని శేష్ చెప్పినట్టయింది. సోషల్ మీడియా ఫాలోయింగ్ లేదా పబ్లిక్ ఈవెంట్లలో వచ్చే గోల ఆధారంగా సినిమాల సక్సెస్ను అంచనా వేయలేమని శేష్ మాటలు నిరూపిస్తున్నాయి. ‘క్షణం’ నుంచి ‘మేజర్’, ‘హిట్ 2’, గూడచారి వరకు శేష్ చేసిన ప్రతి సినిమా ఒక బ్రాండ్ను క్రియేట్ చేసింది. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమా వస్తుందంటే కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్తున్నారు. “పబ్లిసిటీ హంగామా కంటే పస ఉన్న కంటెంట్, హీరోపై ఉన్న నమ్మకమే బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తాయి” అని అర్ధం వచ్చేలా శేష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.