Reading Time: 2 minutes
Ys Jagan Alleges Amaravati Corruption Promotes Mavigun Plan Against Chandrababu

YS Jagan: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్.. అమరావతి పేరుతో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అందుకే ప్రత్యామ్నాయంగా MAVIGUN ప్రణాళికను ప్రతిపాదించామని తెలిపారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టి ప్రజల మధ్యకి వెళ్తానని జగన్ ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతారని చెప్పారు. ప్రజల సమస్యలపై తమ పార్టీ గట్టిగా పోరాటం చేస్తోందని, ఆ విషయంలో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

Read Also: Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

రాజధాని విషయంలో తమ ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాన్ని చూపించిందని జగన్ తెలిపారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్లాన్-Bగా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌గా MAVIGUN ప్రాజెక్టును సూచించామని చెప్పారు. అమరావతిలో ఒక ఎకరాకు కనీస సదుపాయాలకే రూ.2 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం ప్రాజెక్టుకు లక్షల కోట్లు అవసరమవుతాయని జగన్ అన్నారు. అదే మొత్తంలో 10% పెట్టుబడితోనే అభివృద్ధి సాధ్యమని, MAVIGUN ద్వారా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే ఈ ప్రణాళికను తిరస్కరించడం వెనుక అవినీతి ప్రయోజనాలే కారణమని ఆరోపించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళల భద్రత దారుణంగా పడిపోయిందని, వివిధ ఘటనల్లో నిందితులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పుల్లో పెద్ద భాగం నేరుగా ప్రజల ఖాతాల్లో డీబీటీ ద్వారా ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో స్పష్టత లేదని ప్రశ్నించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అన్ని రంగాల్లోనూ పరిస్థితి దిగజారిందని జగన్ పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధరలు లేవని, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కూడా నిర్వీర్యమయ్యాయని, ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. మొత్తంగా రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.