Reading Time: 2 minutes
Amit Shah Criticizes Mamata Banerjee West Bengal Elections Charge Sheet Bjp

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా యావత్తు దేశానికి ముఖ్యమైనవని.. దేశ భద్రతతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. శనివారం కోల్‌కతాలో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనపై ‘‘ఛార్జ్‌షీట్‌’ను అమిత్ షా విడుదల చేశారు. ఇది కేవలం బీజేపీ ఛార్జ్‌షీట్ మాత్రమే కాదని.. బీజేపీ గొంతుకగా నిలుస్తున్న బెంగాల్ ప్రజల ఛార్జ్‌షీట్ అని పేర్కొన్నారు. బెంగాలీయులు భయాన్ని ఎంచుకుంటారా? లేదంటే విశ్వాసాన్ని ఎంచుకుంటారా? అనేది రాబోయే ఎన్నికలు నిర్ణయిస్తాయన్నారు. టీఎంసీ పాలనలో అవినీతి, హింస, వివక్షలతో నిండి ఉందని వర్ణించారు.

ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాధితురాలిగా కూడా నటిస్తారని మమతను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘‘కొన్నిసార్లు కాలు విరగ్గొట్టుకుంటుంది.. మరికొన్నిసార్లు తలకు కట్టు కట్టించుకుంటుంది.. బాధితురాలిగా నటిస్తుంది. ఇంకొన్ని సార్లు అనారోగ్యానికి గురైతే ఎన్నికల కమిషన్‌ను దూషిస్తారు.’’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

చార్జిషీట్‌లోని ముఖ్యాంశాలు..
1. బెంగాల్‌లో ‘సిండికేట్ రాజ్’ స్థాపించబడింది
2. రాష్ట్రం ‘అవినీతి ప్రయోగశాల’గా మారింది
3. వ్యవస్థలో వైట్-కాలర్ నేరగాళ్లు పాలుపంచుకుంటున్నారు
4. ‘కట్ మనీ’ సర్వసాధారణమైపోయింది
5. బెంగాల్ పరిశ్రమలకు ‘స్మశానం’గా మారింది
6. చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నారు
7. బుజ్జగింపు విధానం ప్రభుత్వ విధానంగా మారింది

బెంగాల్ ప్రజలు ఇప్పుడు ‘‘టీఎంసీ పాలన కంటే కమ్యూనిస్టు పాలన మేలు’’ అని చెప్పుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.

‘‘భయం నుంచి స్వేచ్ఛ’’ను ఎంచుకోవడం..

ఈ ఎన్నికలు అనేక రకాల ‘‘భయాల నుంచి విముక్తి’’కి సంబంధించినవని అమిత్ షా అన్నారు.

1. ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందనే భయం నుంచి విముక్తి
2. ఆస్తులు దోపిడీకి గురవుతాయనే భయం నుంచి విముక్తి
3. ఉద్యోగాలు కోల్పోతామనే భయం నుండి విముక్తి …
4. ఉద్యోగాలు కోల్పోతామనే భయం నుంచి విముక్తి
5.  మహిళల భద్రతకు సంబంధించిన భయం నుంచి విముక్తి
6. యువత భవిష్యత్తుపై కమ్ముకున్న చీకటి నుంచి విముక్తి

బెంగాల్‌లో 40 శాతం ఓట్ల వాటాతో బీజేపీ ఇప్పుడు బలమైన పునాది వేసుకుందని చెప్పారు. ఈ ఎన్నిక శాంతి, అభివృద్ధి, విశ్వాసానికి సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులను ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. అటువంటి చొరబాటుదారులను దేశం నుంచి తరిమివేయడమే బీజేపీ అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఎవరు నిర్ణయిస్తారో బెంగాల్ ప్రజలే నిర్ణయించుకోవాలని హితవు పలికారు.

బీజేపీకి ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఉన్నచోట అభివృద్ధి వేగంగా జరిగిందని గుర్తు చేశారు.
1. ఉత్తర ప్రదేశ్‌లో అభివృద్ధి వేగం
2. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ వృద్ధి
3. అస్సాంలో తిరుగుబాటు నుంచి అభివృద్ధి వైపు మార్పు
4. త్రిపురలో ‘కేడర్ పాలన’కు ముగింపు
5. ఒడిశాలో మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం