Reading Time: 2 minutes
Pakistan Airstrike On Kabul Hospital Kills 400 Escalating Border Conflict Near Durand Line

Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై దాడులు చేసింది. ఈ ఘటనలో 400 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ మంగళవారం తెల్లవారుజామున తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స చేసే ఆస్పత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సోమవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో ఆస్పత్రిలోని చాలా భాగాలు నాశనమయ్యాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని ఆయన అన్నారు. భవనంలో మంటలను అదుపు చేయడానికి మరియు శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని ఫిత్రాత్ తెలిపారు.

అయితే.. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లలో జరిపిన దాడుల్లో తాము పౌరుల్ని లక్ష్యంగా చేసుకోలేదని, ఏ ఆస్పత్రిపై దాడులు చేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. ఆఫ్ఘాన్‌పై జరిగిన ఈ దాడిని తాలిబాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారే ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. స్థానిక టెలివిజన్ ఆస్పత్రి శిథిలాల నుంచి వెలువడుతున్న మంటల్ని చూపించింది.

Read Also: Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

ఆఫ్ఘాన్ చేస్తున్న వాదనల్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పౌరస్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని చెప్పింది. ఈ ఆరోపణల్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మోషారఫ్ జైదీ తోసిపుచ్చారు. తాము సైనిక, ఉగ్రవాద మద్దతు కలిగిన మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహించిట్లు పాక్ మంత్రిత్వ శాఖ చెప్పింది.

పాకిస్తాన్, ఆఫ్ఘన్ దళాలు తమ సరిహద్దులో కాల్పులు జరిపాయని ఆఫ్ఘన్ అధికారులు చెప్పిన కొన్ని గంటల తర్వాత ఆరోపించిన వైమానిక దాడి జరిగింది. పాకిస్తాన్ నుంచి రాత్రిపూట మోర్టార్ షెల్స్‌తో ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్సులోని గ్రామాలపై దాడి చేశారని, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించినట్లు ఆఫ్ఘాన్ ఆరోపించింది. రెండు దేశాల సరిహద్దు ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద పోరాటం తీవ్రమైంది. పాకిస్తాన్ లోపల దాడి చేస్తున్న పాకిస్తాన్ తాలిబన్లతో సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, ఆఫ్ఘాన్ పాక్ ఆరోపణల్ని ఖండించింది.