July 11, 2026

Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’

Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
Reading Time: 2 minutes
Rakta Charitra Re Release Rgv Rules Out Part 3 Makes Comments On Rayalaseema Faction

Rakta Charitra: రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘రక్త చరిత్ర’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2010లో విడుదలై భారీ చర్చకు దారితీసిన ఈ చిత్రం దాదాపు 16 ఏళ్ల తర్వాత రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రక్త చరిత్ర పార్ట్ 3 వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేయడంతో పాటు, ప్రస్తుతం రాయలసీమలో ఫ్యాక్షనిజం పరిస్థితులపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రక్త చరిత్ర’ను త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ, రాయలసీమలో జరిగిన యథార్థ సంఘటనలను బాగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ‘రక్త చరిత్ర’ ఒకటని ఆయన పేర్కొన్నారు. ప్రతీకారం, హింస చివరికి ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని వివరించారు.

‘రక్త చరిత్ర’ పార్ట్ 3 తీసే అవకాశం ఉందా?’ అనే ప్రశ్నకు స్పందించిన వర్మ, రెండో భాగంలో ప్రధాన పాత్రల కథ ముగిసిపోయిందని, అందువల్ల మూడో భాగానికి అవకాశం లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అలాంటి కథను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. అలాగే రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గిపోయిన ఈ సమయంలో సినిమాను మళ్లీ విడుదల చేయడం ద్వారా పాత ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారా అనే ప్రశ్నకు కూడా ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేసే వారు ఎక్కువగా ఉన్నారని, కానీ ఒకప్పుడు జరిగినట్లుగా బహిరంగంగా తలపడే పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్ లో లేదని అన్నారు.

సినీ పరిశ్రమలో దర్శకుల కంటే స్టార్ హీరోల ఆధిపత్యం పెరిగిందనే అంశంపైనా వర్మ స్పందించారు. ప్రేక్షకులు స్టార్ హీరోలను చూసే థియేటర్లకు వస్తారని, కోట్ల రూపాయల వ్యాపారం కూడా వారిపైనే ఆధారపడుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో స్టార్ డామినేషన్ సహజమని, అందులో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. దర్శకుడి ప్రతిభ అనేది స్టార్‌ను కథతో ఒప్పించగల సామర్థ్యంలోనే కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తన సినీ ప్రయాణం గురించి కూడా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయనని స్పష్టం చేశారు. కుటుంబం మొత్తం కలిసి సినిమా చూసే సమయంలో ప్రతి ఒక్కరూ వేర్వేరు విషయాలపై దృష్టి పెడతారని, అలాంటి కథలు తనకు ఆసక్తి కలిగించవని అన్నారు. అలాగే పౌరాణిక చిత్రాలపై కూడా తనకు ఆసక్తి లేదని చెప్పారు. భారీ సెట్లు, కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే ఆ తరహా సినిమాల కంటే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే రియలిస్టిక్ డ్రామాలనే తాను ఇష్టపడతానని వెల్లడించారు. ప్రస్తుతం హిందీలో పోలీసు వ్యవస్థ నేపథ్యంతో ఓ సినిమా రూపొందిస్తున్నానని, అందుకే ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలిపారు.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ, ఒకప్పుడు రాయలసీమలో జరిగిన రక్తపాత రాజకీయాలను ఎంతో వాస్తవికంగా ‘రక్త చరిత్ర’లో ఆర్జీవీ చూపించారని అన్నారు. కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఆ చిత్రాన్ని పెద్ద తెరపై చూపించాలనే ఉద్దేశంతోనే రీ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించామని, శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి వెల్లడించారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన ఈ సినిమా, జులై 17న రీ రిలీజ్‌తో మరోసారి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాల్సి ఉంది.