Reading Time: 2 minutes

మూసీ మురికిలో బతకాలని ఎవరు అనుకోరని, గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ఎకో పార్కును సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సినిమా షూటింగ్ ల కోసం విదేశాలకు పోతున్నారని, హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశం లోనే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమయం లో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకువచ్చారని వెల్లడించారు. నాటి నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తో వరదల నివారణకు మూసి పైన నిర్మాణాలు చేపట్టారని, వికారాబాద్ లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్ లు నాటారని గుర్తు చేశారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ లాంటి చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్ లో ఉన్నాయని, కానీ హైదరాబాద్ ఆక్రమణలు ,చెత్త తో నిండిపోయిందన్నారు. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్ అని, నగరాన్ని మంచి గా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదని, తాము చేయలేదు నువ్వు చేయొద్దని అంటున్నారని విమర్శించారు.

వాళ్లకు ఫార్మ్ హౌస్ వచ్చాయని ఎద్దేవా చేశారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామని, విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చినా కానీ ఇప్పుడు పెద్ద ఆస్తి గా మారిందన్నారు. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారబోతుందన్నారు. బెంగళూరు,అమరావతి,చెన్నై కి ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుందని, కొత్త ప్రాజెక్ట్ లు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుందని, కానీ వాళ్ళను అనాథలను చేయం అని స్పష్టం చేశారు. భూమి,ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రపంచం లోనే గొప్ప నగరం గా తీర్చి దిద్దుతామని, ట్రంప్,ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని సీఎం వివరించారు. ప్రపంచం తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అక్క చాలా కాలం మంత్రి గా పనిచేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ ను వీళ్లను తీసుకువచ్చి విమర్శిస్తున్నారని అన్నారు. అక్క కుటుంబానికి 40 సంవత్సరాలు అండగా ఉన్న ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నారని, ఏం చేసినా కేటిఆర్ అడ్డు పడుతున్నాడన్నారు

. హైదరాబాద్ లో మూసీ రివర్ ప్రంట్ ఏర్పాటు చేస్తామని, మూసీ పక్కన నైట్ ఎకనామీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆయా నియోజకవర్గంలో నే ప్రభుత్వ స్థలాలను చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశామని, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ చీరల్లో ఆడ బిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారని, గతం లో ఇచ్చిన బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి వాడారని విమర్శించారు. ఈ సారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తామని, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు.