Reading Time: < 1 minute
Murder Case Honour Killing In Vemulapalli Brothers Kill Brother In Law Over Inter Caste Marriage In East Godavari

Murder Case: పరువు కోసం ప్రాణిలిస్తాం అనేది పాత సామెత.. ఇప్పుడు పరువు కోసం ప్రాణాలు తీస్తామంటున్నారు కొంత మంది. కులపిచ్చితో రగిలిపోతూ.. పచ్చని జీవితాలను మోడుగా చేసుకుంటున్నారు. అంతే కాదు.. తమ పరువు కోసం సొంత వాళ్ల జీవితాలను సైతం అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న సొంత చెల్లెలిపై సోదరులు కక్ష కట్టారు. పెళ్లి చేసుకున్న రెండో రోజే బావను రాళ్లతో కొట్టి చంపేశారు.

T20 World Cup 2026: భారత్ సెమీస్‌ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో ఒక్కసారిగా అలజడి రేగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ దారుణం జరిగింది. కడియం మండలం జేగురుపాడుకు చెందిన అయినవిల్లి సంధ్య రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. వేములపల్లికి చెందిన సూర్యప్రకాష్ రావు అనే యువకుడిని ఆమె ప్రేమిస్తున్నారు. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో.. అన్నవరంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.‌ రాత్రి 11 గంటల సమయంలో నవ దంపతులిద్దరూ పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చారు.

IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!

అదే సమయంలో అక్కడికి చేరుకున్న సంధ్య సోదరులైన గిరిబాబు, చంద్రపాల్ పెళ్లి కొడుకు సూర్య ప్రకాశరావును ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చారు. రోడ్డుపైనే అతనితో గొడవ పడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇద్దరూ.. అతనిపై రాళ్లతో దాడి చేసి చంపేశారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు అన్నదమ్ములు ఇద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కులాంతర వివాహం చేసుకోవడంతోనే పరువు కోసం హత్య చేసినట్లు వారిద్దరూ వెల్లడించారు. ప్రభుత్వ అధికారిగా ఉన్న సంధ్య పెళ్లి చేసుకుని వెళ్లిపోతే కుటుంబానికి ఆదాయం ఉండదని సోదరులు ఇద్దరు చెల్లి భర్తను హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి అన్నదమ్ముల కులపిచ్చి కాస్తా.. ఆమె పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కనీసం కాళ్ల పారాణి ఆరకముందే.. ప్రేమించిన భర్తను కోల్పోయి విలపిస్తోంది.