Reading Time: < 1 minute
Surya Prakash Arrested For Cheating Officials In Cmo Name Siricilla

“నేను సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) నుంచి మాట్లాడుతున్నాను.. వెంటనే నా ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపండి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడతాయి!” – ఇదీ ఒక ఘరానా మోసగాడు అధికారులను బెదిరించే తీరు. తెలంగాణలో పలువురు ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించి, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన రాయబండి సూర్యప్రకాష్ అనే కేటుగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్, గతంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే, గుర్రపు పందేలు, బెట్టింగ్‌లకు బానిసైన అతడికి వచ్చిన జీతం సరిపోలేదు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడి జైలుకు కూడా వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చాక తన రూటు మార్చి, ఏకంగా సీఎంఓ కార్యాలయ అధికారిగా అవతారమెత్తాడు. వార్తాపత్రికల ద్వారా అధికారుల ఫోన్ నంబర్లు సేకరించి, వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు. అయితే ఇటీవల బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు డీఈఈ రఘుపతికి ఫోన్ చేసిన సూర్యప్రకాష్, తాను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి డబ్బు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పన్నిన వ్యూహంలో భాగంగా, రఘుపతి నుంచి నేరుగా డబ్బులు తీసుకోవడానికి కొదురుపాకకు రాగానే పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కాగా పోలీసుల విచారణలో సూర్యప్రకాష్ ఒక గజదొంగ అని తేలింది. ఇతనిపై ఇప్పటికే సీసీఎస్ (CCS)లో రెండు కేసులు, సనత్ నగర్, సిద్దిపేట, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అధికారుల భయాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.