Reading Time: 2 minutes
Kannada Film Producer Kidnaps Actress Wife Bengaluru Case

కన్నడ చిత్రసీమలో కలకలం రేపుతూ, ఒక సినీ నిర్మాత నటి(తన భార్య)ని కిడ్నాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ బిడ్డ కస్టడీ కోసం సాక్షాత్తూ నటి అయిన భార్యనే అపహరించిన ఈ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది. హసన్ జిల్లాకు చెందిన వర్ధన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత, నిర్మాత హర్షవర్ధన్, నటి చైత్ర ఆర్‌కు 2023లో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కూతురు ఉంది. అయితే, గత ఏడెనిమిది నెలలుగా దంపతుల మధ్య తీవ్రమైన మనస్పర్థలు తలెత్తాయి. దీంతో చైత్ర తన భర్తను విడిచి బెంగళూరులోని మాగడి రోడ్డులో ఒక అద్దె ఇంట్లో నివసిస్తూ, టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

Also Read :Brahmanandam : గెటప్స్ చూసి నేను మొదట గుర్తుపట్టలేకపోయా!

తమ కూతురిని తన వద్దకు తెచ్చుకోవాలని భావించిన హర్షవర్ధన్, చైత్రను లొంగదీసుకోవడానికి కిడ్నాప్ ప్లాన్ చేశాడు. డిసెంబర్ 7న మైసూర్ లో ఒక షూటింగ్ ఉందంటూ హర్షవర్ధన్ తన స్నేహితుడు కౌశిక్ ద్వారా చైత్రను నమ్మించాడు. దీనికోసం ఆమెకు రూ. 20,000 అడ్వాన్స్ కూడా చెల్లించారు. షూటింగ్ కోసం బెంగళూరులోని మైసూర్ రోడ్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన చైత్రను, హర్షవర్ధన్ మరియు అతని అనుచరులు బలవంతంగా కారులోకి నెట్టి అపహరించారు. నైస్ రోడ్ మీదుగా ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.

Also Read :OTT Censor : OTTలకి సెన్సార్ చేయడం లేదు.. లోక్‌సభలో ప్రభుత్వం కీలక ప్రకటన !

“పిల్లని ఇస్తేనే.. భార్యను వదులుతా” – బెదిరింపులు
చైత్రను కిడ్నాప్ చేసిన తర్వాత, హర్షవర్ధన్ ఆమె తల్లికి ఫోన్ చేసి అసలు విషయం బయటపెట్టాడు. తన ఏడాది కూతురిని వెంటనే తన వద్దకు తీసుకురావాలని, అలా చేస్తేనే చైత్రను క్షేమంగా విడిచిపెడతానని బెదిరించాడు. పాపను అరసికెరెకు తీసుకురావాలని మరో బంధువుకు కూడా సందేశం పంపాడు. అప్పటి నుంచి చైత్ర ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చైత్ర తల్లి తిప్టూరు నుంచి బెంగళూరుకు చేరుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు హర్షవర్ధన్, కౌశిక్ మరియు మరో వ్యక్తిపై కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నటి చైత్ర ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులే ఇలాంటి అరాచకాలకు పాల్పడటం ఇప్పుడు కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది.