
Rajasthan MDMA Factory: రాజస్థాన్కు చెందిన 28 ఏళ్ల మహావీర్ ఉద్యోగం చేసేవాడు. అయితే వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందలేదు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే.. చివరకు అతడు అద్దె ఇంటినే డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చి, కోట్ల రూపాయల విలువైన MDMA తయారీ చేస్తున్నాడు.
నాగౌర్ పోలీసుల ప్రకారం.. లక్ష్మణ్పురా కుచేరాకు చెందిన మహావీర్ ప్రస్తుతం నాగౌర్ లోని దీప్ కాలనీలో నివసిస్తున్నాడు. ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదనే కారణంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించాడు. ఈ క్రమంలో 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి మధ్య MDMA తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తొలుత చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆన్లైన్లో MDMA తయారీకి సంబంధించిన సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు తెలిపారు. క్రమంగా తయారీ విధానంపై అవగాహన పెంచుకుని అవసరమైన సామగ్రిని సమకూర్చుకున్నాడని చెప్పారు. 2026 ఫిబ్రవరిలో ఉద్యోగాన్ని వదిలేసిన అనంతరం నాగౌర్లోని ఓ అద్దె ఇంటిని ఈ అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా MDMA, దాని తయారీలో ఉపయోగించే పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. మొత్తం 5.418 కిలోల MDMA, సుమారు 2.744 కిలోల కెఫీన్, 24 రకాల రసాయనాలు, సుమారు 210 లీటర్ల వివిధ రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న MDMA, ఇతర పదార్థాల అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా.
పోలీసుల తనిఖీల్లో కేవలం డ్రగ్స్, రసాయనాలు మాత్రమే కాకుండా తయారీకి ఉపయోగించిన పలు పరికరాలు కూడా లభించాయి. మిక్సింగ్ మెషిన్, థర్మామీటర్, మాగ్నెటిక్ స్టిరర్, pH మీటర్, గ్లాస్ బీకర్లు, గాజు జార్లు, ప్లాస్టిక్ పాత్రలు, MDMAను ఆరబెట్టేందుకు ఉపయోగించే పెద్ద ప్లేట్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహావీర్ను అదుపులోకి తీసుకుని ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? తయారైన MDMAను ఎక్కడికి తరలించేవారు? ఎవరికి అమ్మేవారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.