Reading Time: 2 minutes
Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం షాకింగ్ డెసిషన్.. ఇకపై జీరో ట్యాక్స్.. భారీ ఊరట..

స్వాతంత్య్ర దినోత్సవం వేళ పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విండ్ ఫాల్ ట్యాక్స్ విధానంలో మార్పులు చేసింది. కేంద్రం ప్రతీ 15 రోజులకు ఒకసారి వీటిపై సమీక్షిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా సవరణలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరోసారి సవరణలు చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఈ అనిశ్చితి నెలకొన్న క్రమంలో విండ్ ఫాల్ ట్యాక్స్‌ గెయిన్స్ తగ్గిస్తూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశం నుంచి విదేశాలకు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతి చేసే కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది.

సున్నాకు పరిమితం

దేశంలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలపై కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తోంది. తాజాగా ట్యాక్స్ తగ్గించడంతో విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓన్‌జీసీ, ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలకు లబ్ది చేకూరనుంది. పెట్రోల్ ఎగుమతులపై లీటర్‌పై విండ్ ఫాల్ ట్యాక్స్ రూ.3.5గా ఉండగా.. ఇప్పుడు దానికి సున్నాకు పరిమితం చేసింది. అంటే ఇకపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక డీజిల్‌పై గతలో లీటర్‌కు రూ.25.5గా ఉండగా.. ఇప్పుడు రూ.24కి తగ్గించింది. ఈ మేరకు విండ్ ఫాల్ ట్యాక్స్‌పై నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఏవియేషన్ టర్బైన్ ప్యూయెల్‌పై గతంలో లీటర్‌కు విండ్ ఫాల్ ట్యాక్స్ రూ.22గా ఉండగా.. ఇప్పుడు రూ.19.5కి తగ్గించింది. అయితే విండ్ ఫాల్స్ ట్యాక్స్ తగ్గిస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం పడదు. ప్రస్తుతం వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.73గా ఉండగా.. డీజిల్ లీటరు రూ.103.82 పలుకుతోంది. ముడి చమరు ధరలపై అనిశ్చితి నెలకొంది. ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో అర్థం కావడం లేదు.

విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి?

విండ్ ఫాల్ ట్యాక్స్ విధానాన్ని రష్యా-ఉక్రెయిన్ యుద్ద సమయంలో కేంద్రం తీసుకొచ్చింది. 2022 జులై 1న ప్రవేశపెట్టింది. యుద్ద సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో భారత్‌లోని చమురు కంపెనీలు ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసి భారీ లాభాలు మూటకట్టుకున్నాయి. దీనిని నియంత్రించేందుకు, దేశీయంగా లభ్యతను పెంచేందుకు కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ వ్యవస్థను తీసుకొచ్చింది. ముడి చమురు ధరలకు అనుగుణంగా ఈ ట్యాక్సులో 15 రోజులకు ఒకసారి సవరణలు చేస్తూ వస్తోంది.