Reading Time: 2 minutes
Pm Modi Saptdhara Seven Pillars Viksit Bharat 2047

PM Modi’s Saptdhara Vision: భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తు ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేసింది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్), స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా, దేశాన్ని నడిపించే ఏడు ప్రాథమిక శక్తులను “సప్తధార” పేరుతో ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడు రంగాలు భారతదేశ రాబోయే ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు చోదక శక్తులుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

1.మాన్యుఫ్యాక్చరింగ్

మొదటి ధార మాన్యుఫ్యాక్చరింగ్. దేశ తదుపరి వృద్ధి దశకు మాన్యుఫ్యాక్చరింగ్ బలమైన పునాదిగా మోడీ అభివర్ణించారు. కేవలం చిన్న విడిభాగాల తయారీకే
పరిమితం కాకుండా సంపూర్ణ ఉత్పత్తుల (Complete products) తయారీపై భారత్ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో (Global supply chains) భారత్‌ను ఒక కీలక భాగస్వామిగా నిలబెట్టేందుకు ధర, నాణ్యత, విస్తృత స్థాయి ఉత్పత్తి అనే మూడు అంశాలపై తయారీదారులు దృష్టి పెట్టాలని సూచించారు. మన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఖచ్చితత్వంతో కూడిన నాణ్యత ఐడెంటిటీగా మారాలని చెప్పారు.

2.వ్యవసాయం-ఆహార భద్రత

సప్తధారలో రెండవది వ్యవసాయం, ఆహార భద్రత. దేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ప్రధాని, ఆర్థిక వృద్ధిలో ఆహార ఉత్పత్తి, వ్యవసాయం ఎప్పటికీ కేంద్రబిందువులుగా ఉంటాయని స్పష్టం చేశారు. సుదీర్ఘకాల ఆహార భద్రతను నిర్ధారించడానికి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

3. సాంకేతికత, ఆవిష్కరణలు

సాంకేతికత, ఆవిష్కరణలు మూడవ ధారగా అభివర్ణించారు. ప్రపంచం డేటా సెంటర్లు, రోబోటిక్స్, సరికొత్త సాంకేతికతల యుగంలోకి అడుగుపెడుతోందని, ఈ రంగాల్లో భారత్ గ్లోబల్ హబ్‌గా మారాలని పిలుపునిచ్చారు. యుపిఐ (UPI) విజయం ద్వారా భారత్ తన సాంకేతిక సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రపంచానికి నిరూపించిందని, ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు. అలాగే నెక్స్ట్-జెన్ టెలికమ్యూనికేషన్‌ను వేగవంతం చేస్తూ, స్వదేశీ 6G సాంకేతికతను దేశంలోని మూలమూలకూ తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

4. మౌలిక వసతులు

నాల్గవ ధారగా మౌలిక వసతులు, ‘గతి శక్తి’ ద్వారా అనుసంధానాన్ని పెంచడంపై మాట్లాడారు. వ్యాపారాన్ని విస్తరించడానికి, ల్యాజిస్టిక్స్ మెరుగుపరచడానికి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి అత్యంత కీలకమని, వాటికి నిరంతరం ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ వేగవంతమైన కనెక్టివిటీ సరికొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుందన్నారు.

5. రక్షా శక్తి

ఐదవ ధారగా ‘రక్షా శక్తి’ నిలిచింది. రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ తయారీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సైనిక సాంకేతికతలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశద్రోహ భద్రతను గట్టిగా ఉంచడానికి ఆత్మనిర్భర్ రక్షణ రంగం ఎంతో అత్యవసరమని తెలిపారు.

6. గ్రీన్ ఎనర్జీ

ఆరవ ధారగా హరిత ఇంధనాన్ని (గ్రీన్ ఎనర్జీ) ప్రధాని గుర్తించారు. పర్యావరణ పరిరక్షణను కాపాడుతూనే భవిష్యత్తు ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి క్లీన్ ఎనర్జీ సాంకేతికతల్లో ఆవిష్కరణలు చాలా ముఖ్యం అని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడానికి, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు వేగంగా అడుగులు వేయడానికి కృషి చేయాలన్నారు.

7. భారత్ సాఫ్ట్ పవర్..

చివరగా ఏడవ ధారగా భారతదేశం ‘సాఫ్ట్ పవర్’ ను ప్రధాని ఆవిష్కరించారు. భారత్ సాంస్కృతిక ప్రభావం సరిహద్దులు దాటి విస్తరించిందని చెబుతూ.. యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, క్రియేటివ్ రంగాలు భారత సాఫ్ట్ పవర్‌కు ప్రధాన స్తంభాలని వెల్లడించారు. భారతదేశ పర్యాటక రంగానికి భారీ అవకాశాలు ఉన్నాయని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత కృషి చేయాలని కోరారు. జాతీయ పార్కులు, సాంస్కృతిక విశేషాలు, వినోద పరిశ్రమ, వేగంగా విస్తరిస్తున్న ‘కాన్సర్ట్ ఎకానమీ’ పర్యాటకాన్ని బలోపేతం చేయడానికి, భారత్ గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి అద్భుతమైన వేదికలని మోడీ స్పష్టం చేశారు. ఈ సప్తధార సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, 2047 నాటికి దేశాన్ని సంపూర్ణ స్వయంసమృద్ధి కలిగిన వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.