
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. జూలై 1 నుంచి ఈ ఆంక్షలు పూర్తిగా అమల్లో ఉండవని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జూనె నెల ప్రారంభంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా నిషేధించింది. తమ అవసరాలకు సంబంధించిన ఇంధనాన్ని బల్క్ సేల్ పాయింట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది.
జూన్ 11న కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్-2026’ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకేసారి గరిష్ఠంగా 90 రోజుల వరకు ఇలాంటి పరిమితులు విధించే అవకాశం కల్పించింది.
ఆంక్షలు ఎందుకు విధించారు?
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసు, నౌకాశ్రయ రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేంద్రం తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. రిటైల్ ధరలు, బల్క్ ధరల మధ్య వ్యత్యాసం ఉండటంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పెద్దఎత్తున పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు సరఫరా తగ్గి స్థానికంగా ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వివరించింది.
అప్పటి నిబంధనలు ఇవే
ఆ ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు తమ అవసరాలకు సంబంధించిన పెట్రోల్, డీజిల్ను రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి కాకుండా బల్క్ సరఫరా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉండేది. అలాగే డీజిల్ విక్రయాలను వాహనాల ట్యాంకులకు లేదా PESO (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఒక్కో వాహనం లేదా వినియోగదారుడు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేశారు. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం కూడా నిషేధించారు. తాజా నిర్ణయంతో జూలై 1 నుంచి ఈ తాత్కాలిక పరిమితులు తొలగిపోనున్నాయి. దీంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు కూడా మునుపటిలాగే సాధారణ విధానంలో ఇంధన కొనుగోలు చేసేందుకు అవకాశం లభించనుంది.
The Ministry of Petroleum and Natural Gas has withdrawn the temporary regulatory measures governing the sale and distribution of Motor Spirit (MS) and High Speed Diesel (HSD) through retail outlets of Public Sector Oil Marketing Companies with effect from 1st July, 2026. pic.twitter.com/zgGcjs3s02
— ANI (@ANI) June 29, 2026