
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో కొత్త హైవే త్వరలో అందుబాటులోకి రానుంది. కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 342.24 కిలోమీటర్ల మేర హైవే పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. రూ.14 వేల కోట్ల ఖర్చుతో భారతమాల పరియోజన తొలి దశ కింద ఈ ఆరు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మొత్తం 5 జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ హైవే పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. బెంగళూరు, విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. బెంగళూరు, విజయవాడ, అమరావతి మధ్య ప్రయాణించేవారికి ప్రయాణ సమయం తగ్గనుంది.
60 శాతం పనులు పూర్తి
ఆరు వరుసల ఈ రహదారిని నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాత్రింబవళ్లు చేపడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ హైవే పనులు పూర్తయితే.. ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా ఈ కొత్త హైవే నిర్మిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో చితమత్తూరు, గోరంట్ల, ఓడీసీ, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ మీదుగా తలుపుల మండలంలోని నామాలగుండ వద్ద వైఎస్సార్ కడప జిల్లాలోకి వస్తుంది. సత్యసాయి జిల్లాలో 78 కిలోమీటర్ల మేర ఈ ఆరు లైన్ల హైవే ఉండనుండగా.. 60 శాతం పనుల పూర్తయ్యాయి. ఇక వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, వేముల, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా హైవే వెళుతుంది.
ప్రకాశం జిల్లాలో 140 కిలోమీటర్లు
ప్రకాశం జిల్లాలో ఈ హైవే 140 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వెళ్లే ఎన్హెచ్ 167బీ వద్ద ఇంటర్ చేంజ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు 13వ ప్యాకేజీ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ హైవేలో భాగంగా 5.31 కిలోమీటర్ల మేర ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలంలోని 3.67 కిలోమీటర్ల మేర పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు.