Reading Time: < 1 minute
Traffic Diversion: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో జులై 1 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో కొత్త రూట్ మ్యాప్

గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ పరిసరాల్లో కొనసాగుతున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి డీఎల్‌ఎఫ్ గేట్ నెం.1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని జూలై 1 నుంచి 90 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి పనుల పురోగతిని అనుసరించి కొంత మేర రహదారిని తెరిచే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

రాడిసన్ హోటల్ వైపు నుంచి ఐఐఐటీ జంక్షన్‌కు వచ్చే వాహనాలకు డీఎల్‌ఎఫ్ గేట్ నెం.1 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్లే మార్గాన్ని మూసివేయనుండటంతో, వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్–ఇందిరానగర్ మీదుగా ఐఐఐటీ జంక్షన్ చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నాన్-ఎస్‌ఈజెడ్ (సీఎంసీ) గేట్ ద్వారా ప్రయాణించే టీసీఎస్ ఉద్యోగులకు మాత్రం వారి సాధారణ నాన్-ఎస్‌ఈజెడ్ గేట్ ద్వారా ప్రవేశం, నిష్క్రమణకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

లింగంపల్లి వైపు నుంచి డీఎల్‌ఎఫ్ రోడ్డుకు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలు ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకుని అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి రాడిసన్ జంక్షన్ ద్వారా డీఎల్‌ఎఫ్‌కు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ డైవర్షన్లు అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కనీసం ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉన్నందున, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశముందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వారు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి సూచించిన డైవర్షన్లను పాటించాలని, ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతాయని, ప్రజల సహకారంతోనే ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించగలమని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.