Reading Time: 2 minutes
Ex Minister Audimulapu Suresh Ysrcp Kondapi Constituency Next Elections

OTR: వైసీపీ హయాంలో కీల‌క శాఖ‌లు నిర్వహించిన మాజీ మంత్రి ఆదిమూల‌పు సురేష్ రాజకీయ అడుగులపై ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. 2019లో ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించిన ఆదిమూలపు… 2024 ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం కొండేపికి షిఫ్ట్‌ అయి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజ‌క‌వ‌ర్గానికి చుట్టపుచూపులా వ‌చ్చి వెళ్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై వైసీపీలోనే రకరకాల ప్రచారాలు వినిపించాయి. కొండేపిలో ఆయన యాక్టివ్‌గా కనిపించడం లేదన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే… తిరిగి ఎర్రగొండపాలెం వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం మరోవైపు సాగింది. అయితే… ప్రస్తుతం అక్కడ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్రశేఖ‌ర్ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 మందిలో తాటిపర్తి కూడా ఒక‌రు కావ‌టంతో…. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయన్ని ప‌క్కన‌పెట్టి ఆదిమూల‌పు సురేష్‌ను తిరిగి అక్కడికి పంపుతారా అన్న డౌట్స్‌ కూడా వచ్చాయి చాలామందికి. అలాగే… కొండేపిలో వైసీపీ తరపున గెల‌వ‌టంపై అనుమానాలు ఉండ‌టం వ‌ల్లే ఆయ‌న ఆస‌క్తిగా లేరని కూడా చెప్పుకున్నారు. అందుకే ఎర్రగొండ‌పాలెం నుంచి అవ‌కాశం లేకుంటే…. గ‌తంలో తాను పోటీ చేసి గెలిచిన సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అయినా యాక్టివ్‌ అవుతారని, ముందుగానే వెళ్లి కాస్త గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటే గెల‌వ‌వ‌చ్చన్న ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం కూడా జరిగింది.

ప్రస్తుతం సంత‌నూత‌ల‌పాడు ఇంచార్జ్‌గా ఉన్న మ‌రో మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌క‌వర్గం వేమూరు నుంచి పోటీకే ఆస‌క్తిగా ఉన్నార‌ట. దాంతో… ఆదిమూల‌పు సురేష్ సంతనూతలపాడు వెళ్ళడం ఖాయమని కూడా కొంద‌రు గ‌ట్టిగానే చెప్పారు. కానీ… ప్రస్తుతం పరిస్థితులు మారిపోయి ఆదిమూలపు స‌డన్‌గా కొత్త ట‌ర్న్ తీసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కొండేపి నుంచే పోటీ చేస్తాన‌ని ప్రక‌టించి ఊహించ‌ని ట్విస్ట్‌ ఇచ్చారు. ఇన్నాళ్ళు నియోజకవర్గానికి వ‌చ్చామా.. వెళ్లామా అన్నట్లుగా టైంపాస్ చేసిన మాజీ మంత్రి ఇటీవ‌ల మనసు మార్చుకున్నారట. గ‌తంలో పార్టీ కార్యక్రమాల‌ను సైతం ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు అప్పగించి మ‌మ అనిపించిన సురేష్‌…. ప్రస్తుతం అన్నీతానే ప‌ర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. పార్టీ శ్రేణుల‌ను గ‌ట్టిగానే కార్యక్రమాల‌కు మొబ‌లైజ్ చేస్తున్నార‌ని స‌మాచారం.. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్బాల్లో పార్టీ నేత‌ల‌తో మాట్లాడిన మాజీ మంత్రి తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, త్వరలోనే కొండేపిలో సొంత ఇల్లు కూడా కట్టుకుంటానని చెప్పేశారట. ఇదే స‌మ‌యంలో టంగుటూరు మండ‌లం జ‌మ్ముల‌పాలెంలో కూట‌మి నుంచి పలువురిని వైసీపీలోకి ఆహ్వానించ‌టం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆయ‌న ఇక కొండేపిలోనే కంటిన్యూ అవుతార‌ని పార్టీ వర్గాలు కూడా ఫిక్స్‌ అవుతున్నాయి. దీంతో ఎర్రగొండపాలెం… సంతనూతలపాడు… కొండేపి… ఈ మూడు నియోజకవర్గాల చుట్టూ సాగిన ప్రచారానికి ఇప్పటికైతే తెరపడినట్టేనని అంటున్నారు. మ‌రి సురేష్… తాను చెప్పిన‌ట్టే కొండేపికి సింక్‌ అవుతారా? లేక ఎన్నికల నాటికి మళ్ళీ పరిస్థితులు మారతాయా అన్నది వేచి చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.