
ముంబై తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. 26 అడుగుల తిమింగలం వచ్చింది. దీంతో మత్స్యకారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి రక్షించేలోపే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని బాంద్రా సముద్ర తీరంలో 26 అడుగుల పొడవైన ఓ చిన్న హంప్బ్యాక్ తిమింగలం (Humpback Whale) కొట్టుకొచ్చింది. అధికారులు, అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యులు కలిసి దానిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరకు మృతి చెందింది. దీంతో అధికారుల శ్రమంతా వృధా అయింది.
శనివారం ఉదయం బాంద్రా-వర్సోవా సీ లింక్ ప్రాజెక్టు పనుల్లో ఉన్న కార్మికులు బాంద్రాలోని కార్టర్ క్లబ్ సమీపంలోని రాతి తీరానికి ఈ తిమింగలం కొట్టుకొచ్చినట్లు గుర్తించారు. అప్పటికి అది ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ మాంగ్రోవ్ సెల్ (ఉత్తర కొంకణ్ విభాగం), బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC), ముంబై అగ్నిమాపక శాఖ, వన్యప్రాణి వైద్యుల బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. తిమింగలానికి సహాయం చేసి తిరిగి లోతైన సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కొంతసేపటి తర్వాత తిమింగలం ఎలాంటి కదలికలు చూపకపోవడంతో అటవీశాఖ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తిమింగలం సుమారు 26 అడుగుల పొడవు ఉంది.
హంప్బ్యాక్ తిమింగలాల ప్రత్యేకత
హంప్బ్యాక్ తిమింగలాలు ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర క్షీరదాల్లో ఒకటి. పూర్తిగా ఎదిగిన తిమింగలాలు 50 నుంచి 60 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. సముద్రం నుంచి ఎగిరి పడే విన్యాసాలు, ప్రత్యేకమైన శబ్దాలతో ఇవి ప్రసిద్ధి చెందాయి. చల్లని సముద్ర ప్రాంతాల నుంచి వేడి ఉష్ణమండల సముద్రాలకు వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్తుంటాయి. ముంబై తీరంలో వీటి దర్శనం చాలా అరుదుగా జరిగినప్పటికీ.. వలస ప్రయాణ సమయంలో అరేబియా సముద్రం గుండా ప్రయాణిస్తాయని సముద్ర జీవ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిన్న తిమింగలాలు తల్లి నుంచి విడిపోవడం, అనారోగ్యం, గాయాలు, బలమైన అలలు, సముద్ర ప్రవాహాలు లేదా నీటి అడుగున ఏర్పడే శబ్దాల కారణంగా దారి తప్పి ఒడ్డుకు కొట్టుకొచ్చే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తిమింగలం ఒడ్డుకు ఎలా కొట్టుకొచ్చింది? మృతికి అసలు కారణం ఏమిటి? అనే విషయాలు పోస్ట్మార్టం, శాస్త్రీయ పరీక్షల అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, సముద్ర జీవుల నిర్వహణ నిబంధనల ప్రకారం అవసరమైన పరీక్షలు పూర్తయ్యాక తిమింగలం కళేబరాన్ని భూస్థాపితం చేయనున్నట్లు వెల్లడించారు.