Reading Time: 2 minutes
Telangana Ips Officers Transfers 2026

IPS Transfers: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు కీలక అధికారులకు స్థానచలనం కల్పించడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది.

వరంగల్ కొత్త సీపీగా ఎన్. శ్వేత.. సున్‌ప్రీత్ సింగ్ బదిలీ

హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. దీనితో పాటు ఆమెకు మల్టీజోన్ పరిధిలోని డీఐజీ (జోన్-4, భద్రాద్రి) పూర్తి అదనపు బాధ్యతలను (FAC) అప్పగించారు. ఇప్పటివరకు వరంగల్ సీపీగా ఉన్న సున్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఆయనకు అదనంగా డీఐజీ (జోన్-3, రాజన్న) బాధ్యతలను కూడా కేటాయించారు. అలాగే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు దక్కాయి.

జోనల్ డీఐజీలుగా కీలక అధికారులకు అదనపు బాధ్యతలు

రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంబర్ కిశోర్ ఝాకు అదనంగా డీఐజీ (జోన్-1, కాళేశ్వరం) బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ డీఐజీ (జోన్-5, యాదాద్రి)గా, ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ ఆర్. భాస్కరన్ డీఐజీ (జోన్-2, బాసర)గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.

సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో నియామకాలు

తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్‌పీగా బదిలీ అయ్యారు. అంతేకాకుండా ఎస్‌పీ (ఎస్‌ఐబీ)గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్‌ఐబీ ఎస్‌పీగా ఉన్న వై. సాయి శేఖర్ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ డీసీపీగా ఉన్న చెర్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. ప్రవీణ్ కుమార్‌లు సీఐడీ ఎస్‌పీలుగా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సిటీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా నియమించగా, గతంలో ఆయనను సీఐడీ ఎస్‌పీగా నియమించిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఇక వనపర్తి అదనపు ఎస్పీగా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న బి. రాములు నాయక్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.