
బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాధిత బాలిక వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బాధితురాలి గోప్యతను దెబ్బతీస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు
ఇటీవల నమోదైన FIR నంబర్ 684/2026కు సంబంధించిన కేసులో బాధితురాలి వివరాలను బయటపెట్టినందుకు గానూ.. పేట్ బషీరాబాద్ పోలీసులు మరో కొత్త FIR నమోదు చేశారు. FIR నంబర్ 706/2026 కింద.. జువెనైల్ జస్టిస్ యాక్ట్, BNS , POCSO చట్టంలోని కఠిన నిబంధనల ప్రకారం కేసులు బుక్ చేశారు.
బాధిత బాలిక ఫోటోలు, వీడియోలు, చివరకు ఆమె తల్లిదండ్రుల వివరాలను ప్రచారం చేసిన ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ ఖాతాల URLలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులు ఎవరు? ఆ వివరాలను ఎక్కడ నుంచి సేకరించారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. చట్ట ప్రకారం బాధితురాలి వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం తీవ్రమైన నేరమని.. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులను షేర్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.