
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ అంటేనే భారీ చిత్రాల సందడి. ముఖ్యంగా రంజాన్ సీజన్ను బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే వచ్చే ఏడాది రంజాన్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఒకవైపు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోవైపు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ తమ చిత్రాలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్‘. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుని మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 9 లేదా 10 తేదీల్లో రంజాన్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో 2015లో ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్‘ విడుదలైన వారం రోజులకే సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్జాన్’ విడుదలైంది. అప్పట్లో రెండు సినిమాలు కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో వారం రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ తలపడనుండటం ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. సల్మాన్ ఖాన్ తన సినిమాలను రంజాన్కే విడుదల చేయాలనే సెంటిమెంట్ను బలంగా నమ్ముతారు. అయితే ఇటీవల వచ్చిన ‘సికిందర్‘ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఈసారి ఎలాగైనా 1000 కోట్ల క్లబ్ లో చేరాలని సల్లూభాయ్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతోనైనా సల్మాన్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని అందుకుంటారో లేదో చూడాలి.