
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న ‘కాంతార’ మిమిక్రీ వివాదంలో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై రిషబ్ శెట్టి నటనను అనుకరించే క్రమంలో, దైవానికి సంబంధించిన సంప్రదాయాన్ని రణవీర్ కించపరిచారనే ఆరోపణలతో బెంగళూరులో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణవీర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు..
ఆయనకు ఒక షరతు విధించింది. తన వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు ప్రాయశ్చిత్తంగా మైసూరులోని చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని ఆదేశించింది. అది కూడా రణవీర్ నాలుగు వారాల లోపు ఆలయాన్ని సందర్శించి తన పశ్చాత్తాపాన్ని చాటుకోవాలని కోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెబుతూ.. తన ఉద్దేశ్యం ఎవరినీ బాధించడం కాదని, కేవలం రిషబ్ శెట్టి నటనను అభినందించడమేనని ఆయన స్పష్టం చేశారు. రణవీర్ ఆలయ సందర్శన పూర్తి చేసి, తన భక్తిని చాటుకున్న తర్వాత ఈ ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టివేస్తూ తుది తీర్పు ఇస్తామని జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం వెల్లడించింది. అలాగే సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మతపరమైన, సంస్కృతి పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు హితవు పలికింది. కాగా ఈ వివాదం సద్దుమణిగితే ఆయనకు పెద్ద ఊరట లభించినట్లే.